బోర్గా అనిపించడం లేదా
2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో తనపై ఆసీస్ ప్లేయర్లు స్లెడ్జింగ్కి దిగినట్లు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, నయావాల్ చతేశ్వర్ పుజారా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 'అప్పుడు స్లెడ్జింగ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాని నాకు మొదటి టెస్టుకు సంబందించింది ఓ ఘటన గుర్తుంది.
నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నాథన్ లైయాన్ మరియు టిమ్ పైన్ నన్ను స్లెడ్జ్ చేయడానికి ప్రయత్నించారు. మూడు లేదా నాలుగో టెస్టు (సరిగా గుర్తులేదు)లో కూడా వీరిద్దరూ నాపై స్లెడ్జింగ్ చేశారు. లైయాన్ బౌలింగ్లో నేను పదే పదే బంతిని డిఫెన్స్ చేస్తుండటంతో.. "నీకు బ్యాటింగ్ చేస్తుంటే బోర్గా అనిపించడం లేదా? ఇప్పటికే నువ్వు చాలా పరుగులు చేశావు" అని నాకు వినిపించేలా మాటలు అన్నాడు' అని పుజారా తెలిపాడు.
అశ్విన్పై కూడా
ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు వేర్వేరు ఇన్నింగ్స్ల్లో కనీసం 200 బంతులు ఎదుర్కొన్న రెండో బ్యాట్స్మెన్గా చతేశ్వర్ పుజారా నిలిచాడు. గతంలో ఇంగ్లాండ్కి చెందిన బాయ్కాట్ (1970-71) మాత్రమే ఈ ఘనతని సాధించాడు. తాజా పర్యటనలో భారత బౌలర్లు మొహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రాలపై ఆసీస్ అభిమానులు స్లెడ్జింగ్కి దిగారు. వారిపై క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు కూడా తీసుకుంది. ఇక ఆర్ అశ్విన్పై టిమ్ పైనీ.. గబ్బాకి రా చూస్కుందాం అని సవాల్ విసరగా.. రిషబ్ పంత్ స్టంప్ ఔట్ని చేజార్చి గబ్బాలో గొప్ప ఆతిథ్యమిచ్చావని అశ్విన్ సెటైర్ పేల్చాడు.
ఐదు గంటల పాటు క్రీజులో
ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్లో పుజారా దాదాపు ఐదు గంటల పాటు క్రీజులో ఉంది భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తమ సహనానికి పరీక్షగా నిలిచి పుజారాను ఆసీస్ బౌలర్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చెక్కు చెదరకుండా ఆడాడు. షాట్ బాల్స్ పదే పదే గాయపరిచే ప్రయత్నం చేసినా నొప్పిని భరిస్తూ ఆటను కొనసాగించాడు. పుజారా గ్లోవ్స్, బాడీ, హెల్మెట్కు పదేపదే బంతులు తగిలినా ఏమాత్రం బెదరలేదు. క్రీజులో ఉంటూ యువ ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇచ్చాడు. 211 బంతులు ఆడి 52 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో నెగ్గిన భారత్ 2-1తో సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది.
33వ వసంతంలోకి
ఛతేశ్వర్ పుజారా నేడు 33వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆట పట్ల అతడి నిబద్ధత, అంకితభావాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ల వెల్లువ కొనసాగుతోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 'హ్యాపీ బర్త్డే పుజ్జీ.. నువ్వు ఎల్లప్పుడూ సౌఖ్యంగా, సంతోషంగా ఉండాలి. ఎన్నో గంటల పాటు క్రీజులో ఉండాలి. రాబోయే సంవత్సరం నీకు మరింత గొప్పగా ఉండాలి' అని విష్ చేశాడు. ఇక బీసీసీఐ సైతం తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది.