బ్రిస్బేన్: క్రికెట్లో టీమిండియా పేసర్ మొహ్మద్ సిరాజ్ కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడు అని ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్ అన్నాడు. క్రికెట్లో జాత్యహంకారానికి చోటు లేదన్నాడు. సిడ్నీ టెస్టు మూడు, నాలుగో రోజులలో సిరాజ్ను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆసీస్ ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోతి అని పిలిచినట్టు తెలుస్తోంది. దీంతో మ్యాచ్ అధికారులకు సిరాజ్ ఫిర్యాదు చేయగా.. ఆకతాయిల్ని సెక్యూరిటీ సిబ్బంది స్టేడియం బయటకు పంపించింది. ఈ నేపథ్యంలో జాతివివక్షపై లైయన్ స్పందించాడు.
'క్రికెట్లో జాత్యహంకారానికి, దూషణకు చోటు లేదు. ఇలా చేయడం మైదానంలోని అభిమానులు ఫన్నీగా భావిస్తారు. కానీ ఇది ఆటగాళ్లను ఎంతో ప్రభావితం చేస్తుంది. భారత పేసర్ మొహ్మద్ సిరాజ్కు జరిగిన సంఘటన బాధాకరం. గతంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో నేనూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను' అని నాథన్ లైయన్ అన్నాడు. లైయన్ ఆసీస్ తరఫున 99 టెస్టులు ఆడి 396 వికెట్లు పడగొట్టాడు. 29 వన్డేలు, రెండు టీ20లు కూడా ఆడాడు.
'సాధ్యమైనంత వరకు జాత్యహంకార ఘటనలు జరగకుండా ప్రయత్నించాలి. అయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే.. ఆటగాళ్లు వాటిని మ్యాచ్ అధికారుల వద్దకు తీసుకువెళ్లాలి. వివక్షకు గురైతే ఆటను నిలిపివేసి, ఆకతాయిల్ని స్టేడియం బయటకి పంపించే అవకాశం ఆటగాళ్లకు ఉంది. ఎంతో మంది సెక్యూరిటీ సిబ్బంది స్టేడియంలో ఉంటారు. ఆకతాయిల్ని క్షణాల్లో స్టాండ్స్ నుంచి ఖాళీ చేయిస్తారు. ఆటగాళ్లకు అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వవని ఆశిస్తున్నా' అని లైయన్ పేర్కొన్నాడు. క్రికెట్లో సిరాజ్ కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడన్నాడు.
సిడ్నీ టెస్టులో మొహ్మద్ సిరాజ్తో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఆట అనంతరం టీమిండియా యాజమాన్యం ఈ విషయాన్ని ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా, మ్యాచ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. నాలుగో రోజు కూడా సిరాజ్ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సిరాజ్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఆటను పది నిమిషాలు పాటు నిలిపివేసి ఆకతాయిల్ని సెక్యూరిటీ సిబ్బంది స్టేడియం బయటకు పంపింది. ఆపై ఆట సజావుగా సాగింది.
విమర్శించిన బీజేపీ ఎంపీకి.. దిమ్మదిరిగే రిప్లై ఇచ్చిన హనుమ విహారి!!