హైదరాబాద్: పాకిస్తాన్ బ్యాట్స్మన్ నాసిర్ జంషెడ్పై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) 10 ఏళ్ల పాటు నిషేధం విధించింది. జంషెడ్ పీసీబీ అవినీతి నిరోధక శాఖ కోడ్ను ఉల్లంఘించిన కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు బోర్డు అధికారిక ప్రకటనలో పేర్కొంది.
బోర్డు అవినీతి నిరోధక శాఖ కోడ్ను ఉల్లంఘించిన కారణంగా నాసిర్ జంషెడ్ ఏ స్థాయి క్రికెట్ కూడా ఆడటానికి వీళ్లేదని శుక్రవారం ముగ్గురు సభ్యుల స్వతంత్ర అవినీతి నిరోధక ట్రిబ్యునల్ ప్రకటించింది. దీంతో బోర్డు కోడ్ ఉల్లంఘించిన క్రికెటర్లు పీసీబీలో సైతం ఏలాంటి బాధ్యతలు చేపట్టకూడదు.
గత రెండేళ్లలో నాసిర్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శిక్ష విధించడం ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్లో అతనిపై ఏడాది పాటు నిషేధం విధించింది. 2017లో జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్లో నాసిర్ స్పాట్ ఫిక్సింగ్లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ అవినీతి ఆరోపణల్లో భాగంగా అతడు విచారణకు సహకరించపోవడంతో అతడిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ పీసీబీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో బ్రిటన్ పోలీసులు అతన్ని గతేడాది ఫిబ్రవరిలో అరెస్టు కూడా చేశారు. దీంతో పాకిస్థాన్ సూపర్ లీగ్లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన ఆరో ఆటగాడిగా జంషెడ్ నిలిచాడు.
కాగా, పాక్ తరపున 48 వన్డేలు ఆడిన నాసిర్ 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలతో 1418 పరుగులు చేశాడు. ఓపెనింగ్ బ్యాట్స్మన్ అయిన నాసిర్ 18 టీ20లు, రెండు టెస్టులకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్థాన్ జాతీయ జట్టు నాసిర్ తరుపున చివరిసారిగా 2015 వరల్డ్ కప్లో ఆడాడు.