న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ లేకుండా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేడని, అలాగే ధోనీ లేకుండా తమ ఫ్రాంచైజీ కూడా లేదని ఆ జట్టు యజమాని ఎన్ శ్రీనివాసన్ తెలిపారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2021 సీజన్లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. తమ జట్టు నాలుగో సారి టైటిల్ గెలవడంతో సోమవారం చెన్నైలోని వెంకటాచలపతి ఆలయాన్ని ఆయన ట్రోఫీతో సహా దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో ధోనీని రిటైన్ చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. రిటైన పాలసీపై క్లారిటీ లేదన్నాడు. అయితే ధోనీని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని చెప్పకనే చెప్పాడు. ఫైనల్లో కోల్కతాను ఓడించి టైటిల్ గెలవడం అద్భుతమన్నాడు. 'కోల్కతాపై ఫైనల్లో గెలుపొంది నాలుగో సారి ఐపీఎల్ టైటిల్ సాధించడం చిరస్మరణీయం. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రగామి జట్టుగా ఎదిగింది. చెన్నై జట్టులో ధోనీ అంతర్భాగం. అతను లేనిదే మా జట్టు లేదు. మా జట్టు లేకుండా అతను లేడు' అని చెప్పుకొచ్చారు.
చెన్నై ఫ్రాంఛైజీలో ఒక్క తమిళనాడు క్రికెటర్ కూడా లేడని ప్రశ్నించగా.. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో (టీఎన్పీఎల్) ఆడే 13 మంది ఆటగాళ్లు.. ఐపీఎల్ లేదా టీమిండియాలో ఆడుతున్నారని గుర్తుచేశారు. ఇప్పుడిప్పుడే టీన్పీఎల్కు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. చివరగా ఐపీఎల్ విజయోత్సవంపై మాట్లాడిన శ్రీనివాసన్.. ధోనీ భారత్కు తిరిగి వచ్చాక ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వచ్చే ఏడాది కొత్తగా రెండు జట్లు వచ్చి చేరుతుండటంతో బీసీసీఐ మెగా వేలం నిర్వహించనుంది. దాంతో ఆయా జట్ల ఆటగాళ్లంతా వేలంలోకి రానున్నారు. అయితే టీమ్స్ రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అయితే నలుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకోవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇద్దరు విదేశీ, మరో ఇద్దరు స్వదేశీ లేదా ముగ్గురు స్వదేశీ, ఒకరు విదేశీ ఆటగాడిని తీసుకోవచ్చని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కానీ అధికారికంగా ప్రకటించలేదు. దాంతో రిటెన్షన్ పాలసీపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే ధోనీ సైతం వచ్చే సీజన్ తాను ఆడేది బీసీసీఐ వెల్లడించే రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉందన్నాడు.
మరోవైపు ధోనీని వదులుకునే ప్రస్తకే లేదని సీఎస్కే వర్గాలు పేర్కొన్నాయి. 'ఐపీఎల్ 2022లో రిటెన్షన్ పాలసీ ఉంటే.. మా మొదటి ప్రాధాన్యం ఎంఎస్ ధోనీకే. అయితే ముందుగా మనం రిటెన్షన్ పాలసీ నియమాలను తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం తెలియదు. ఆటగాళ్లను నిలుపుకోగలిగితే.. ధోనీని ముందుగా ఎంచుకుంటాం. కచ్చితంగా చెబుతున్నా మహీ వచ్చే ఏడాది కూడా ఆడతాడు' అని చెన్నై సూపర్ కింగ్స్ అధికారి ఒకరు వెల్లడించారు.