హైదరాబాద్: మిర్పూర్ వేదికగా వెస్టిండిస్తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్ తరుపున టెస్టుల్లో నాలుగువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ధోనికి సాధ్యం కాలేదు: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ముష్ఫికర్
తద్వారా ఈ ఘనత సాధించిన రెండో బంగ్లాదేశ్ క్రికెటర్గా ముష్పికర్ రహీమ్ గుర్తింపు సాధించాడు. అంతకుముందు తమీమ్ ఇక్బాల్ ఒక్కడే బంగ్లాదేశ్ తరుపున నాలుగు వేల టెస్టు పరుగుల్ని సాధించిన క్రికెటర్గా ఉన్నాడు. తాజాగా అతని సరసన రహీమ్ నిలిచాడు.
మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా శుక్రవారం షేర్-ఇ బంగ్లా జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైన రెండో టెస్టు మొదటిరోజే రహీమ్ ఈ మైలురాయిని అందుకున్నాడు. వెస్టిండిస్తో మ్యాచ్కు ముందు రహీమ్ నాలుగు వేల పరుగులకు ఎనిమిది పరుగుల దూరంలో ఉన్నాడు.
విండిస్ బౌలర్ దేవేంద్ర బిషూ వేసిన 65 ఓవర్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో రహీమ్(14) వ్యక్తిగత పరుగుల వద్ద ఉండగా పెవిలియన్ చేరాడు. 16 ఏళ్ల వయసులో 2005లో ఇంగ్లాండ్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ముష్పికర్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు.
Congratulations to Mushfiqur Rahim for becoming the second Bangladeshi cricketer to pass 4,000 Test runs 👏👏👏 pic.twitter.com/GxeF4HIuT7
— ICC (@ICC) November 30, 2018
ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టెస్టు మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా టెస్టు ఫార్మాట్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా రికార్డు సాధించాడు. 2013లో గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో ముష్ఫికర్ రహీం టెస్టుల్లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు.
టెస్టుల్లో రెండో డబుల్ సెంచరీ చేసిన క్రమంలోనే బంగ్లాదేశ్ తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన షకీబ్ ఉల్ హాసన్(217) పరుగుల రికార్డుని సైతం అధిగమించాడు. జనవరి, 2017లో వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో షకీబ్ ఈ ఘనత సాధించాడు.