చోటు కష్టమే:
టీమిండియా జట్టులో మురళీ విజయ్ ఎప్పుడో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. ఒకవైపు ఫామ్ కోల్పోవడం, మరోవైపు కుర్రాళ్లు జట్టులోకి రావడంతో విజయ్ చోటు కోల్పోయాడు. ఇప్పుడున్న పరిస్థితులలో ఫామ్ అందుకున్నా.. చోటు దక్కడం కష్టమే. ఏదైనా అద్భుతం జరిగే తప్ప చోటురాదు. ప్రస్తుతం మురళీ తమిళనాడు తరఫున రంజీ క్రికెట్ ఆడుతున్నాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ మురళీ కొన్ని విషయాలు పంచుకున్నాడు.
గంగూలీపై నమ్మకం ఉంది:
'బీసీసీఐ అధ్యక్ష స్థానంలో గంగూలీ ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వస్తుందనుకుంటున్నా. కెరీర్లో దాదా కూడా సంధి దశను అనుభవించారు. ఆపై ఘనంగా పునరాగమనం చేశారు. ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రికెటర్ల కోరికలు, భావోద్వేగాలు ఆయనకు బాగా తెలుసు. గంగూలీ ఆటగాళ్ల మనిషి. ఆయనది బలమైన వ్యక్తిత్వం' అని మురళీ పేర్కొన్నాడు.
ఒంటరివాళ్లను చేయొద్దు:
'క్రికెటర్లు బాగా ఆడేందుకు దాదా ఏదో ఒక వ్యవస్థను రూపొందిస్తారని నా నమ్మకం. జాతీయ జట్టులో చోటు కోల్పోయాక భారత్-ఏ, దులీప్ ట్రోఫీకి సైతం నన్ను ఎంపిక చేయలేదు. నా ఒక్కడి గురించే మాట్లాడటం లేదు. పునరాగమనం చేయాలనుకుంటున్న క్రికెటర్లందరి గురించి మాట్లాడుతున్నా. ఆటగాళ్లను ఒంటరివాళ్లను చేయొద్దు. అత్యుత్తమంగా ఆడే సత్తా ఉన్నా.. తక్కువ స్థాయిలో ఆడటం బాధగా ఉంటుంది' అని మురళీ అన్నాడు.
వైరల్ ఫొటోలు.. చెల్లెలి మెహందీ వేడుకలో సానియా హొయలు!!
భారత జట్టును రెండుగా విభజించాలి:
'అవసరాన్ని బట్టి నేను మిడిలార్డర్లో ఆడతానని సెలక్టర్లకు ఇంతకుముందే చెప్పా. టీమిండియాకు చాలా సేవ చేశా. కనీసం నాకు ముందుగా సమాచారం ఇవ్వకుండానే ఆటగాళ్ల కాంట్రాక్టుల నుంచి తప్పించారు. పునరాగమనం చేయగలనని కలలు కంటూనే ఉండాలా?, లేదా అది సాధ్యమయ్యేందుకు ఏదైనా వ్యవస్థ ఉందా?. భారత జట్టును రెండుగా విభజిస్తే బాగుంటుంది. కీలకమైన సిరీసులకు ప్రధాన జట్టు, మిగతా సిరీస్లకు రెండో జట్టు ఆడాలి. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే' అని మురళీ తన ఆలోచనను బయటపెట్టాడు.