'ఐపీఎల్ 2021 వేలం జరగకుండా ముంబై ఇండియన్స్ అడ్డుకోవాలి.. లేదంటే'

హైదరాబాద్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నవంబర్ 10న ముగిసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో భారత్లోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021లో మరో కొత్త జట్టు రానుందని సమాచారం. కొత్త జట్టు ఐపీఎల్లో అడుగుపెడుతున్నందున పూర్తి స్థాయిలో మెగా వేలానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నద్ధం అవుతోందట. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో వేలం జరగనుందని ఫ్రాంచైజీలకు బోర్డు సంకేతాలిచ్చిందని సమాచారం. స్టార్ ఆటగాళ్లు కూడా వేలంలోకి రానున్నారు. ఐపీఎల్ 2020లో ప్రదర్శన ఆధారంగా ఫ్రాంచైజీలు వచ్చే సీజన్లో ఏయే ఆటగాళ్లను రిలీజ్ చేయాలి.. ఎవరిని అట్టిపెట్టుకోవాలనే విషయంలో త్వరలోనే కసరత్తులు మొదలుపెట్టనున్నాయి.

చోప్రా సలహా:
ఐపీఎల్ 2021కి ముందు ఆటగాళ్ల వేలం పాట జరగకుండా ముంబై ఇండియన్స్ అడ్డుకోవాలని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన ఆకాశ్.. సరదాగా (నవ్వుతూ) ఈ వ్యాఖ్యలు చేశాడు. ముంబై జట్టు ప్రస్తుతం బాగుందని, వేలం జరిగితే ఆటగాళ్లు మారే అవకాశం ఉందని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ఈ వేలంపాట జరిగినా ఆ జట్టుకొచ్చే నష్టం లేదన్నాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలుచుకొని.. ఐదోసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ లీగ్లో రోహిత్ అత్యంత విజయవంతమైన సారథిగా కొనసాగుతున్నాడు.

వేలం జరగకుండా ముంబై అడ్డుకోవాలి:
'ఐపీఎల్ 2021కి ముందు ఆటగాళ్ల వేలం పాట జరగకుండా ముంబై ఇండియన్స్ అడ్డుకోవాలి. ఒకవేళ ఈ వేలం పాట జరిగినా.. ముంబై జట్టుకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే.. ముంబై ప్రాంచైజీ సరైన ప్రణాళికతో అందరికన్నా ముందు ఉంటుంది. వేలం పాట జరిగినా 5-6 మంది ఆటగాళ్లు అలాగే కొనసాగుతారు. ఆ జట్టులో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నందున అందర్నీ అట్టిపెట్టుకోలేదు. అప్పుడు జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి' అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.

మూడేళ్ల తర్వాత:
'టాప్ ఆటగాళ్లను కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు కాకుండా మరో మూడేళ్ల తర్వాత వేలం పాట జరగాలని ముంబై ఇండియన్స్ ఆశించే ఆస్కారం ఉంది. వేలం జరిగేది లేనిది ముంబై చేతిలో మాత్రం ఉండదు. వేలం జరిగినా ఆ జట్టు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ జరిగితే కొందరు ఆటగాళ్లు ఇతర జట్లకు మారుతారు. దాంతో ఇతర జట్లు రోహిత్ టీమ్కు కాస్త గట్టి పోటీనిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర జట్లతో ముంబైని పోల్చడం సరికాదు. అవి చాలా దూరంలో ఉన్నాయి. దీంతో వచ్చే ఏడాది ముంబై నుంచి ఇంకాస్త మంచి ప్రదర్శన ఆశిస్తున్నా' అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.

9వ జట్టుగా గుజరాత్:
ఐపీఎల్ 2021లో మరో కొత్త జట్టు రానుంది. 9వ జట్టుగా గుజరాత్ ఆడనుందని తెలుస్తోంది. అహ్మదాబాద్ బేస్డ్గా ఏర్పాటయ్యే కొత్త ఫ్రాంచైజీని కొనుగోలుచేయడానికి ఓ కార్పొరేట్ దిగ్గజం, సినీ తారలు సిద్ధంగా ఉన్నారని సమాచారం. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్, సంజీవ్ గోయెంకా ఆధ్వర్యంలోని ఆర్పీఎస్జీ కొత్త ఐపీఎల్ జట్టు రేస్లో ప్రధానంగా ఉన్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా బరిలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరి కొత్త జట్టు వస్తే.. టోర్నీ బ్రాండ్ విలువ, మ్యాచుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
ఒక్కమాట.. హార్దిక్ పాండ్యా గురించి బుమ్రా ఏం చెప్పాడో తెలుసా?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications