న్యూఢిల్లీ: అమెరికాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్కు ప్రచారం చేయాలనుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్కు ఊహించని షాక్ తగిలింది. అమెరికాలో బ్రాండ్ ఐపీఎల్ను ప్రోత్సహించాలన్న ముంబై ఇండియన్స్ ప్రణాళిక విన్నపాన్ని సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలక కమిటీ (సీఓఏ) తిరస్కరించింది.
రిటైర్మెంట్ అనంతరం ఆస్ట్రేలియాలో స్థిరపడనున్న మలింగ
ముంబై ఇండియన్స్ జట్టు తమ అభిమానుల సంఖ్యను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాలని పూనుకుంది. ఇందులో భాగంగా అమెరికాలో పర్యటించడంతో పాటు అక్కడి స్థానిక జట్లతో కొన్ని మ్యాచ్లు ఆడాలని భావించింది. మరోవైపు స్టార్ క్రికెటర్లను కలిసే అవకాశాన్ని కూడా కల్పించాలనుకుంది. అయితే ఐపీఎల్ లీగ్ బీసీసీఐ అనుబంధ టోర్నీ కాబట్టి.. అమెరికా టూర్ అనుమతి కోరుతూ సీఓఏకు లేఖ రాసింది. ఈ అనుమతి లేఖను సీఓఏ తిరస్కరించింది. దీంతో ముంబై ఇండియన్స్ ఆశలు ఆవిరయ్యాయి.
'ఐపీఎల్ బ్రాండ్కు అమెరికాలో ప్రాచుర్యం తేవడంతో పాటు క్రికెట్ మార్కెట్ను సృష్టించాలని ముంబై జట్టు భావించింది. కానీ సీఓఏ అనుమతి నిరాకరించడం దురదృష్టకరం' అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా వచ్చే ఆదాయాన్ని బీసీసీఐతో పంచుకోవాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావించింది. కానీ సీఓఏ అనుమతి ఇవ్వకపోవడంతో ముంబై ప్రణాళిక బెడిసికొట్టింది.
ఐపీఎల్ 2019 ఫైనల్ గెలిచి ముంబై ఇండియన్స్ నాలుగో సారి టైటిల్ను సొంతం చేసుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో లంక పేసర్ లసిత్ మలింగా మ్యాజిక్ చేయడంతో ముంబై ఒక్క పరుగు తేడాతో విజేతగా నిలిచింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా.. వాట్సన్ ఔట్ కావడంతో చెన్నై ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై 147 పరుగులే చేసింది.