
బుబల్ లైఫ్తో విసిగి..
'టీ20 ప్రపంచకప్ ముందు కోహ్లీ ఈ ప్రకటన చేయడంతో కొంత ఆశ్చర్యానికి గురయ్యా. బబుల్ వాతావరణంలో ఉండటంతో కోహ్లీ విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా చేసిందనుకుంటా. బబుల్ వాతావరణం అతని మానసిక స్థితిపై ప్రభావం పడుతున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. దశాబ్దకాలంలోనే 70 సెంచరీలు బాదిన అరుదైన ఆటగాడు విరాట్ కోహ్లీ. తన ఆటతో ట్రెండ్ సెట్ చేశాడు. అయితే బబుల్ లైఫ్ అతని వ్యక్తిగత ప్రదర్శనపై కూడా ప్రభావం చూపింది.

బ్యాటింగ్పై ఫోకస్ పెట్టేందుకు..
బ్యాటింగ్పై మరింత ఫోకస్ పెట్టేందుకే విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని భావించి ఉండవచ్చు. బహుషా టీ20 సారథ్యం నుంచి తప్పుకుంటే కాస్త ఉపశమనం లభిస్తుందని అతని భావించి ఉండవచ్చు.టీ20 క్రికెట్లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలో విజయాలందుకుంది. తన సారథ్యంలో తొలి టీ20 ప్రపంచకప్కు సిద్దమవుతోంది. ఈ నిర్ణయం అతనిపై ఒత్తిడి తగ్గించి స్వేచ్చగా ఆడేలా చేస్తుంది. ఆ కారణంతోనే అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ముందే ప్రకటించినట్లున్నాడు.'అని ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

బ్యాట్స్మన్గా కొనసాగుతా..
'భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నాయకత్వం కూడా వహించే అదృష్టం నాకు దక్కింది. సారథిగా ఉన్న నాకు ఈ ప్రయాణంలో సహకరించిన సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ, కోచ్లతో పాటు జట్టు గెలవాలని కోరుకున్న ప్రతీ భారతీయుడికి నా కృతజ్ఞతలు. గత 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతూ 5-6 ఏళ్లుగా కెప్టెన్గా వ్యవహరిస్తున్న నాపై తీవ్ర పనిభారం ఉంది.
దీనిని అర్థం చేసుకోవడం అవసరం. భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్గా నా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించేందుకు నాకు కొంత ఉపశమనం అవసరం. సారథిగా జట్టుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన నేను, ఇకపై టీ20 బ్యాట్స్మన్గా కూడా అదే తరహాలో శ్రమిస్తాను. ఈ నిర్ణయం తీసుకునేందుకు నాకు చాలా సమయం పట్టింది. మున్ముందూ భారత జట్టుకు నా సేవలు అందిస్తూనే ఉంటాను. 'అని కోహ్లీ తన ప్రకటనలో పేర్కొన్నాడు.

కొత్త కెప్టెన్ ఎవరు?
కోహ్లీ ప్రకటనతో ఇప్పుడిక టీ20ల్లో అతని వారసుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్లో ముంబైని అయిదుసార్లు విజేతగా నిలపడమే పేరు తెచ్చుకోవడమే కాక.. కోహ్లీ అందుబాటులో లేనపుడు భారత జట్టును చక్కగా నడిపించిన రోహిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ కోహ్లీ కంటే రెండేళ్లు పెద్దవాడు, ఇంకో మూణ్నాలుగేళ్లలో రిటైరయ్యే అవకాశమున్న 34 ఏళ్ల రోహిత్కు కుర్రాళ్ల ఆటైన టీ20 ఫార్మాట్లో కెప్టెన్సీ అప్పగించడం సరైందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాహుల్, శ్రేయస్, పంత్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications












