పంత్ గడ్డుకాలం అనుభవిస్తున్నాడు
తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'ఉపఖండం పిచ్లపై నాణ్యమైన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్లో కీపింగ్ చేయాలంటే అద్భుత నైపుణ్యాలు అవసరం. రిషభ్ పంత్ వీటిని మెరుగుపర్చుకోవాలి. అదే విదేశాల్లో ఆడినప్పుడు ఇలాంటి పరిస్థితులు తక్కువ. ప్రస్తుతం పంత్ గడ్డుకాలం అనుభవిస్తున్నాడు. ఫిట్నెస్ స్థాయి మరింత దిగజారింది. అయితే కష్టపడితే అతడు మెరవగలడు. వార్మప్ మ్యాచులో అతడు శతకం బాదిన సంగతి గుర్తుపెట్టుకోవాలి' అని అన్నాడు.
భారత్లో సాహా, విదేశాల్లో పంత్
'అన్ని ఆలోచిస్తే వృద్ధిమాన్ సాహా బదులు మిగిలిన టెస్టుల్లో రిషబ్ పంత్ను తీసుకోవడం మంచిది. సాహా మంచి వికెట్కీపరే అయినా విదేశాల్లో బ్యాటింగ్ పరంగా బలహీనం. పంత్.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో సెంచరీలు బాదాడు. ఎంతో ప్రతిభ ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. అందుకే కీపర్ కమ్ బ్యాట్స్మన్ స్థానంకు భారత్లో సాహా, విదేశాల్లో పంత్కు ప్రాధాన్యం ఇవ్వాలి' అని ఎమ్మెస్కే ప్రసాద్ సూచించాడు. పంత్ కెరీర్ ఆరంభం నుంచి ఎమ్మెస్కే మద్దతుగా ఉంటున్న విషయం తెలిసిందే. 2019 ప్రపంచకప్లో పంత్ను ఎమ్మెస్కే ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
పంత్కు చోటిస్తే బాగుండు
అడిలైడ్లో భారత్ పొరపాటు చేసిందని ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అక్కడ సాహా బదులు పంత్కు చోటిస్తే బాగుండేదన్నాడు. 'రిషబ్ పంత్ ఫిట్గా లేకపోవడంతోనే తీసుకోలేదన్నది నిజమే. అతడు మ్యాచ్కు ముందే ఫిట్నెస్ సాధించాల్సి ఉంది. పంత్ తుది జట్టులో చోటు దక్కించుకొని ఉంటే భారత్కు అదనంగా మరో బ్యాట్స్మన్ లభించేవాడు. తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకోవడం అవసరం. విఫలమవుతున్న అతనికి మరిన్ని అవకాశాలివ్వాలి. మిగతా మూడు టెస్టుల్లో ఆడుతున్నావని ఆత్మవిశ్వాసం అందించాలి. అప్పుడే అతడు స్వేచ్ఛగా ఆడగలడు. అతడిలో ధీమా నింపితే కచ్చితంగా రాణిస్తాడు' అని ఆయన తెలిపారు.
బ్యాటింగ్ వస్తే.. కీపింగ్ రాదు
టీమిండియా వికెట్ కీపర్లు రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహాల పరిస్థితి ఒకరికి బ్యాటింగ్ వస్తే మరొకరికి కీపింగ్ రాదనే వాతావరణం నెలకొందని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. పంత్కు కీపింగ్ రానప్పుడు.. గత సీజన్లో వికెట్ల వెనుకాలా ఎలా రాణించాడని, సాహా సెంచరీ ఎలా చేశాడని చోప్రా ప్రశ్నించాడు. ఈ ఇద్దరు ప్రస్తుతం ఫామ్లో లేరని చెప్పాడు. డిసెంబర్ 26 నుంచి రెండో టెస్ట్ మొదలవ్వనుంది.