వీరూపై ఆశలు వదులుకున్న చెన్నై:
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు తమ కెప్టెన్గా వీరేంద్ర సెహ్వాగ్ను తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ నిర్ణయించుకుందట. ఫస్ట్ చాయిస్ కెప్టెన్గా వీరూను తీసుకుంటామని శ్రీనివాసన్ కూడా చెప్పారట. వేలంలో ఎలాగైనా వీరూను దక్కించుకుని ఆయనకే కెప్టెన్సీ ఇవ్వాలనేది చెన్నై ఆలోచన. అయితే సెహ్వాగ్ మాత్రం తాను మొదటి నుంచి ఢిల్లీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాను కనుక ఢిల్లీ ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ డేర్డెవిల్స్కే ఆడతానని చెప్పాడట. దాంతో చెన్నై వీరూపై ఆశలు వదులుకుంది.
ముంబైతో పోటీపడి:
ఢిల్లీ ఐకాన్ ప్లేయర్గా వీరేంద్ర సెహ్వాగ్ ఎంపిక కావడంతో.. వేలంలో అతడు అందుబాటులో లేకుండా పోయాడు. ఇక 2007 టీ20 ప్రపంచకప్ను ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా గెలవడంతో.. మహీని సీఎస్కే ఎంపిక చేసుకుంది. ముందుగా సెహ్వాగ్ను తీసుకోవాలనుకున్న శ్రీనివాసన్.. తర్వాత ధోనీ కోసం ముంబై ఇండియన్స్తో పోటీపడ్డారు. వేలం పాటలో మహేంద్రుడిని ఏకంగా రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి టీ20 వరల్డ్ కప్ గెలవడమే దీనికి కారణం. ఆ ఏడాది వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ధోనీనే కావడం విశేషం.
వీరేంద్రుడి నుంచి మహేంద్రుడికి:
ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా పొట్టి కప్ గెలిచిందన్న నమ్మకంతోనే సీఎస్కే యాజమాన్యం తమ జట్టు పగ్గాలు మహేంద్రుడికే అప్పగించింది. ఇలా కెప్టెన్గా సీఎస్కే ఫస్ట్ చాయిస్ వీరేంద్రుడి నుంచి మహేంద్రుడికి మారింది. ఈ విషయాలను తాజాగా భారత మాజీ క్రికెటర్, సీఎస్కే ఆటగాడు బద్రినాథ్ యూట్యూబ్ చానెల్ ద్వారా వెల్లడించారు. మహీ ఉండడంతో ఐపీఎల్ తొలి సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఐకానిక్ ప్లేయర్ను ఎంపిక చేయలేదు.
2008 నుంచి ధోనీనే:
2008 నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కెప్టెన్సీని మార్చకపోవడం గమనార్హం. ఇక ఎంఎస్ ధోనీ సారథ్యంలో సీఎస్కే మూడు సార్లు (2010, 2011, 2018) ఐపీఎల్ టైటిళ్లు గెలవగా.. రెండు సార్లు (2010, 2014) ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. లీగ్లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19న రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్, డిపెడింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది.
'ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ నరైన్.. అతడు జట్టులో ఉండటం మా అదృష్టం'