లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా చేజార్చుకోకుండా..
టీమిండియా ఫుల్ స్వింగ్లో ఉంది. ఎదురుగా ఉన్నది ఎలాంటి జట్టయినప్పటికీ.. దాన్ని చిత్తు చిత్తుగా చితగ్గొడుతోంది. విజయాలను అందుకుంటోంది. సెమీఫైనల్ వైపు దూసుకెళ్తోంది. ప్రపంచకప్ వేదికగా ఇప్పటిదాకా సాగిన అన్ని మ్యాచ్లనూ టీమిండియా ఏకపక్షంగా మలచుకుంది. ప్రత్యర్థిని బెంబేలెత్తించేలా తన ప్రపంచకప్లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లో కూడా ఘన విజయాన్ని అందుకుని.. సరికొత్త రికార్డులను నెలకొల్పాలనేది కోహ్లీసేన లక్ష్యం. ప్రపంచకప్ టోర్నమెంట్లో లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీ ఫైనల్కు వెళ్లడం ఓ రికార్డే మరి!
పంటి కింద రాయిలా..
ప్రస్తుతం టీమిండియాలో పంటి కింద రాయిలా మారిన సమస్యలు రెండు ఉన్నాయి. ఒకటి- నంబర్ ఫోర్. రెండోది వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ శైలి. ఈ రెండు సమస్యలను ఎదుర్కొంటోనడానికి తంటాలు పడుతోంది. ఆల్రౌండర్ విజయ్ శంకర్ను నంబర్ ఫోర్ స్థానంలో ఆడిస్తున్నప్పటికీ.. అతను రాణించట్లేదు. తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పడుతున్నాడు. విజయ్ శంకర్ను పక్కన పెట్టాల్సిన వస్తే.. మరో బౌలర్ను అదనంగా తుది జట్టులో చోటు కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. విజయ్ శంకర్ బౌలింగ్ కూడా చేయగలడు. అతని కోటాను భర్తీ చేయడానికి మరో పార్ట్ టైమర్ను బరిలో దింపాల్సి వస్తుంది. నాలుగో స్థానం కోసం విజయ్ శంకర్కు ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోనీయకుండా చేస్తోన్న అంశం ఇదొక్కటే.
ధోనీ ఫామ్ గురించి కాదు గానీ..
టీమిండియా మేనేజ్మెంట్ను కలవరపెడుతోన్న అంశం మహేంద్ర సింగ్ ధోనీ స్ట్రైక్ రేట్. ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ ఎదుర్కొన్న చివరి రెండు మ్యాచుల్లో ధోనీ.. తన సహజ శైలికి భిన్నంగా ఆడాడనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ధోనీ స్ట్రైక్ రేట్ సైతం దీన్నే సూచిస్తోంది. చీల్చి చెండాడాల్సిన ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ను మహేంద్ర సింగ్ ధోనీ అతిగా గౌరవించాడని అంటున్నారు విమర్శకులు. ప్రత్యేకించి స్పిన్ బౌలింగ్లో మరీ మందకొడిగా పరుగులు చేశాడని సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీలు ఇప్పటికే విమర్శలు గుప్పించారు. ఆప్ఘనిస్తాన్ మ్యాచ్లో గానీ, వెస్టిండీస్తో మ్యాచ్లో గానీ ధోనీ తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది.
52 బంతులకు 28 పరుగులే..
ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ధోనీ పూర్తిగా రక్షణాత్మక స్థితిలో బ్యాటింగ్ చేశాడనే విషయం అందరికీ తెలుసు. 52 బంతులను ఆడిన ధోనీ.. 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. భారీ షాట్ ఆడబోయి క్రీజును వదిలి ముందుకొచ్చాడు. స్టంప్ అవుట్ అయ్యాడు. ధోనీ స్టంప్ అవుట్ కావడం చాలా అరుదు. మొన్నటి వెస్టిండీస్తో మ్యాచ్లో కూడా ధోనీ స్టంప్ అవుట్ అయ్యేవాడే అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బంతిని మిస్ అయిన ధోనీ నాలుగైదు అడుగులు ముందుకెళ్లినప్పటికీ..వికెట్ కీపర్ షైహోప్ ఉదాసీనత వల్ల సురక్షితంగా క్రీజులోకి చేరుగలిగాడు. అప్పటికి ధోనీ చేసింది ఎనిమిది పరుగులే. ఆ స్టంపవుట్ను షై హోప్ మిస్ కాకుండా ఉండి ఉంటే ధోనీ అవుటైన తీరుపై మరోసారి పెద్ద చర్చే జరిగి ఉండేది. ఆ ఛాన్స్ ఇవ్వలేదు షై హోప్. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్పై ధోనీ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.