సచిన్, కోహ్లీలను మహీ దాటేశాడు
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. అభిమానుల ఆదరణ విషయంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను మహీ దాటేశాడని లిటిల్ మాస్టర్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2020లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గవాస్కర్.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య శనివారం జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
ధోనీ కోసం దేశం ఉంది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'క్రికెట్ సంస్కృతి లేని రాంచీ లాంటి ప్రాంతం నుంచి రావడంతో ఎంఎస్ ధోనీని మొత్తం దేశం ప్రేమిస్తోంది. సచిన్ టెండూల్కర్కు ముంబై, కోల్కతా.. విరాట్ కోహ్లీకి ఢిల్లీ, బెంగళూరు ఉన్నాయి. కానీ ఎంఎస్ ధోనీ విషయానికి వస్తే అతని కోసం పూర్తి దేశం ఉంది. మహీ అభిమానులను చూస్తే.. ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తోంది' అని అన్నారు. గవాస్కర్ భారత్ తరఫున 125 టెస్టులు, 108 వన్డేలు ఆడారు. సన్నీ టెస్టుల్లో ఆకట్టుకున్నా.. వన్డేల్లో మాత్రం తనదైన ముద్ర వేయలేకపోయారు.
అసలైన సింగాన్ని తలపించాడు
చెన్నై అభిమానులు ముద్దుగా 'తలా' అని పిలుచుకునే ఎంఎస్ ధోనీ.. శనివారం మ్యాచ్లో అసలైన సింగాన్ని తలపించాడు. గుబురు మీసాలు, తీక్షణమైన చూపులతో వింగ్ కమాండర్ అభినందన్ను గుర్తుచేశాడు. మైదానంలో మహీని చూడగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆగస్టు 15, 7 గంటల 29 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. శనివారం 7.30కి పసుపు రంగు దుస్తుల్లో మైదానంలో అడుగుపెట్టడం కొసమెరుపు.
క్రీజులోకి వచ్చినా:
ఏడాదికి పైగా విరామం తర్వాత మళ్లీ మైదానంలో కనిపించిన ఎంఎస్ ధోనీ.. కృనాల్ పాండ్య క్యాచ్ను డైవ్ చేస్తూ అందుకున్న తీరు మురిపించింది. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేసినా.. 39 ఏళ్ల వయసొచ్చినా తనలో చురుకుదనం తగ్గలేదని వికెట్కీపింగ్తో రుజువు చేశాడు. ఇక తనదైన కెప్టెన్సీతో చివరి ఓవర్లలో ముంబైని దెబ్బ తీసిన వైనమూ అభిమానులను ఆకట్టుకుంది. అయితే బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చినా.. పరుగులు చేసే అవకాశం మాత్రం రాలేదు.