హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్కింగ్స్ ఐపీఎల్లో మళ్లీ పునరాగమనం చేయడం, ధోని తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయింది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఐపీఎల్ మ్యాచ్ల కోసం చెన్నైలో ధోని అడుగు పెట్టిన క్షణం నుంచి అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గతంలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగిన సమయంలో ఓ అభిమాని మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చిధోని కాళ్లకు మొక్కడాన్ని మనం చూశాం. అయితే, ధోని వీరాభిమాని అయిన జార్ఖండ్కు చెందిన ఓ బాలుడు మాత్రం ఊహించని సాహసం చేశాడు.
మహేంద్ర సింగ్ ధోనీని తిరిగి పసుపు రంగు జెర్సీలో చూసేందుకు పదో తరగతి చదువుతోన్న ఆ విద్యార్థి ఇంట్లో చెప్పకుండా స్కూల్ నుంచి నేరుగా ముంబై వెళ్లిపోయాడు. మ్యాచ్ చూసేందుకు ముంబై పంపాలని అడిగితే తల్లిదండ్రులు ఎలాగూ పంపరని భావించిన సౌరభ్ కుమార్ అనే ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు.
చెన్నైలో ఐపీఎల్ లేనట్లే!: విశాఖ లేదా హైదరాబాద్లో నిర్వహించే ఛాన్స్
ఐపీఎల్ టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం (ఏప్రిల్ 7) చెన్నై సూపర్కింగ్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చూసేందుకు జార్ఖండ్లోని రామ్ఘర్కు చెందిన పదో తరగతి విద్యార్థి సౌరభ్ కుమార్ ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు.
ఏప్రిల్ 5న ఉదయం ఎప్పటిలాగే ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన సౌరభ్ కుమార్ ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలుడి కోసం తీవ్రంగా గాలించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా రాజరప్ప ఆలయం సమీపంలోని అడవుల్లో సౌరభ్ వాడే స్కూటర్ ధ్వంసమై కనిపించింది.
దీంతో వెంటనే సౌరభ్ తండ్రి అశోక్ పోలీసులను ఆశ్రయించి తన కుమారుడు కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడు. సౌరభ్ కిడ్నాప్కు గురయ్యాడని భావించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం.. ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అతన్ని గుర్తించే ప్రయత్నం చేశారు.
సౌరభ్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ముందు మధ్యప్రదేశ్ వెళ్లారు. ఆ తర్వాత ముంబైలో సౌరభ్ను అదుపులోకి తీసుకున్నారు. మ్యాచ్ చూడటానికి ముంబై పంపాలని అడిగితే తల్లిదండ్రులు ఎలాగూ పంపరని భావించి ఇలా చేసినట్లు సౌరభ్ పోలీసులకు తెలిపాడు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ 'క్రికెటర్ ధోనికి సౌరభ్ వీరాభిమాని. రెండేళ్ల నిషేధం తర్వాత ముంబైలోని వాంఖడే మైదానంలో ధోనీ సేన తిరిగి పసుపు రంగు జెర్సీల్లో తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న సౌరభ్ ఇంట్లో అడిగితే ముంబై పంపించరని భావించాడు. అందుకే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు' అని తెలిపారు.
పోలీసులు అతన్ని జార్ఖండ్ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ధోని కోసం సౌరభ్ చేసిన సాహసం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.