న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కొత్తేం కాదు. గతంలో చాలా సార్లు ఫిక్సింగ్ భూతం టీమిండియాను వెంటాడింది. తాజాగా ఇప్పుడు టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే 2014లో మాంచెస్టర్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ల మధ్య జరిగిన నాల్గో టెస్టు మ్యాచ్ ఫిక్సయ్యిందని ఆనాటి టీమిండియా క్రికెట్ మేనేజర్, ఇప్పటి డిల్లీ, ఢిల్లీ జిల్లా అసోసియేషన్ సెక్రటరీ సునీల్ దేవ్ వెల్లడించిన విషయం ఆదివారం హిందీ డైలీ సన్ స్టార్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది.
భారత్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయిన ఆ మ్యాచ్లో ధోనీ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్లో బౌలింగ్కు పరిస్థితులు అనుకూలంగా ఉంండగా కెప్టెన్ ధోని టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం మొత్తం జట్టును ఆశ్చర్యానికి గురి చేసిందని, ఆ మ్యాచ్ ఫిక్స్ అయిందనే సందేహాన్ని వ్యక్తం చేశాడు.
ఆ మ్యాచ్కి భారత జట్టు కెప్టెన్గా ధోని ఉన్నాడు. 'వర్షం కారణంగా పిచ్ పరిస్థితి దృష్ట్యా మొదట బౌలింగ్ చేయాలని జట్టు సమావేశంలో నిర్ణయించాం. కానీ, ధోనీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో నేను ఆశ్చర్యానికి గురయ్యా' అని స్టింగ్ ఆపరేషన్లో భాగంగా చిత్రీకరించిన వీడియోలో దేవ్ పేర్కొన్నాడు.
ఈ వీడియోను ఆదివారం భారత ప్లెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ధోని నిర్ణయాన్ని చూసి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్కాట్ కూడా షాకయ్యాడని వీడియోలో దేవ్ పేర్కొన్నాడు. దీంతో ఈ వార్త దేశ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది.
ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లానని, నాటి బోర్డు అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్కు లేఖ రాశానని చెప్పాడు. అయితే ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటికీ దానిపై స్పందించలేదని దేవ్ సమాధానమిచ్చాడు. మరోవైపు
తాను చేసిన ఆ ఆరోపణల్ని సునీల్ దేవ్ ఖండించాడు.
ఆ వీడియోకి తనకు ఎటువంటి సంబంధలేదని పేర్కొన్నాడు. తనపై ఆరోపణలు చేసిన ఆ హిందీ డైలీపై చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. 2014లో టీమిండియా-ఇంగ్లాండ్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ను ఇంగ్లాండ్ 3-1 తేడాతో గెలుచుకుంది.