విజయానికి 18 పరుగులు:
అసలు ఏమైందంటే.. చివరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరం. చివరి ఓవర్ అందుకున్న స్టోక్స్.. తొలి బంతి ఆఫ్స్టంప్ ఆవల వేయగా జడేజా సిక్స్ బాదాడు. తర్వాత స్టోక్స్ నోబాల్ వేయగా.. జడేజా సింగిల్ తీశాడు. ఫ్రీహిట్కు ధోనీ రెండు పరుగులు తీశాడు. కానీ తర్వాతి బంతిని స్టోక్స్ యార్కర్ వేయగా.. సరిగ్గా అంచనా వేయలేక ధోనీ బౌల్డయ్యాడు. దీంతో చెన్నై చివరి మూడు బంతుల్లో 8 పరుగులు చేయాలి.
ఆవేశంగా మైదానంలోకి ధోనీ:
నాలుగో బంతిని స్టోక్స్.. శాంట్నర్కు నడుంపైకి వేసాడు ( బంతిని ఎదుర్కొన్న శాంట్నర్ రెండు పరుగులు తీసాడు). దీంతో ప్రధాన అంపైర్ హైట్ నోబాల్గా ప్రకటించాడు. అయితే లెగ్ అంపైర్ కాదనడంతో.. ప్రధాన అంపైర్ వెంటనే చేతిని దించేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. క్రీజులో ఉన్న జడేజా అభ్యంతరం వ్యక్తం చేస్తుండగానే.. కెప్టెన్ ధోనీ ఆవేశంగా మైదానంలోకి దూసుకొచ్చి అంపైర్లతో వాదనకు దిగాడు. దీంతో కాసేపు ఆట నిలిచిపోయింది. ధోనీ వాదించినా.. అంపైర్లు అది నోబాల్ కాదనడంతో చేసేదేమీలేక తిరిగి పెవిలియన్ కు వెళ్ళిపోయాడు.
చర్యలు తీసుకునే అవకాశం:
ఇక ఐదో బంతికి శాంట్నర్ రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సివుండగా స్టోక్స్ వైడ్ వేశాడు. అదనపు బంతిని శాంట్నర్ సిక్స్ కొట్టి చెన్నైకి విజయాన్ని అందించాడు. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన ధోనీపై మ్యాచ్ రిఫరీ గట్టిగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎంపైర్ తప్పిందం వల్లే ధోనీ జోక్యం చేసుకున్నాడు. ఈ విషయాన్ని కూడా రిఫరీ పరిగణలోకి తీసుకుంటే.. ధోనీపై తీసుకునే చర్యలు తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా డగౌట్లో ఉన్న ఒక కెప్టెన్ మైదానంలోకి రావడం ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే.