హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కొత్త సెలక్టర్ల ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. భారత మాజీ క్రికెటర్లు మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్తో కూడిన క్రికెట్ సలహా కమిటీ కొత్త సెలక్టర్లను ఎంపిక చేయనుంది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే.
వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, లక్ష్మణ్ శివ రామకృష్ణన్, వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్, నయన్ మోంగియా, చేతన్ చౌహాన్, నిఖిల్ చోప్రా, అబే కురువిల్లాలు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో వీరికి ఇంటర్య్వూలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో వీరిలో చీఫ్ సెలక్టర్గా ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, అభ్యర్థుల్లో అత్యంత సీనియర్ లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవి దక్కుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో లక్ష్మణ్ శివ రామకృష్ణన్కి ఎక్కువ అనుభవం ఉంది. 1983లో ఆయన అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. అయితే, తక్కువ టెస్టులు ఆడాడు. వెంకటేశ్ ప్రసాద్ (33 టెస్టులు), అగార్కర్ (26 టెస్టులు)లు ఎక్కువ మ్యాచులు ఆడారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా రేసులో ఉన్నారు.
అయితే, ఇక్కడ అగార్కర్ ఎంపికకు జోన్ సమస్య వస్తోంది. ఇప్పటికే జతిన్ పరాంజపె వెస్ట్జోన్ నుంచి ఉన్నారు. ముంబైకి చెందిన అగార్కర్ కూడా ఎంపికైతే వెస్ట్జోన్ నుంచి కమిటీలో ఇద్దరు ఉంటారు. ఇక్కడ బీసీసీఐ నిబంధనలు అడ్డు వస్తున్నాయి. దీంతో అగార్కర్కి కష్టమనే సందేహం తలెత్తుతోంది.చూద్దాం... బీసీసీఐ ఛీఫ్ సెలక్టర్ పదవి ఎవరిని వరిస్తోందో?