
బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ కూడా ఒకడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ లేని సమయంలో ఉమేష్ యాదవ్తో కలిసి పేస్ బౌలింగ్ విభాగాన్ని నడిపించాడు సిరాజ్. ఆడలేని బంతులతో బంగ్లా బ్యారట్లను ముప్పుతిప్పలు పెట్టిన ఈ హైదరాబాదీ పేసర్కు స్వదేశం తిరిగి వచ్చే సమయంలో చేదు అనుభవం ఎదురైంది.
ఢాకా నుంచి ఢిల్లీ మీదుగా ముంబై వచ్చేందుకు ఎయిర్ విస్తారా విమానంలో సిరాజ్ ప్రయాణించాడు. ఈ సమయంలో అతని మూడు బ్యాగుల్లో ఒక బ్యాగు కనిపించకుండా పోయింది. ఇదే విషయాన్ని ఎయిర్పోర్టు సిబ్బందికి చెప్తే.. సాధ్యమైనంత త్వరగా బ్యాగు ఎక్కడుందో వెతికి హైదరాబాద్లోని సిరాజ్ ఇంటికి పంపేస్తామని చెప్పారట. కానీ 24 గంటలు గడిచిన తర్వాత కూడా తన బ్యాగు రాకపోవడంతో సిరాజ్ అసహనం వ్యక్తం చేశాడు. ట్విట్టర్ వేదికగా ఎయిర్ విస్తారాకు ఫిర్యాదు చేశాడు.
'యూకే182, యూకే951 విమానాల్లో ఈ నెల 26న నేను ప్రయాణించాను. ఢాకా నుంచి ఢిల్లీ మీదుగా ముంబై చేరుకున్నా. ఈ సమయంలో నా మూడు బ్యాగుల్లో ఒకటి కనిపించకుండా పోయింది. వెంటనే బ్యాగును వెతికి నాకు పంపిస్తామని చెప్పారు. కానీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ బ్యాగులో నాకు ముఖ్యమైన వస్తువులు చాలా ఉన్నాయి. దయచేసి నా బ్యాగును హైదరాబాద్లో మా ఇంటికి డెలివరీ చేసే చర్యలను వేగవంతం చేయండి' అని ట్వీట్ చేశాడు.
తాజాగా తన బ్యాగు దొరికినట్లు తెలిసిందని సిరాజ్ ట్వీట్ చేశాడు. 'థాంక్యూ విస్తారా. బ్యాగు దొరికిందని తెలిసింది. హైదరాబాద్కు అది వచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నా' అని ట్వీట్ చేశాడు. దీనిపై అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బ్యాగు తిరిగి అతన్ని చేరుకోవడానికి మాత్రం వారం రోజులు పట్టే అవకాశం ఉందని, తమకు కూడా అలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయని కొందరు వివరణ ఇస్తున్నారు.