టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లాదేశ్కు తొలి బంతికే షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్ షాంటో తను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టులో బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. మిడిలార్డర్లో వచ్చి కేఎల్ రాహుల్ (73) మాత్రమే రాణించాడు. మిగతా బ్యాటర్లు అందరూ చేతులెత్తేశారు. దీంతో భారత జట్టు 186 పరుగులకే ఆలౌట్ అయింది.
లక్ష్య ఛేదనలో బంగ్లాకు కూడా శుభారంభం దక్కలేదు. సీనియర్లు లేని సమయంలో భారత బౌలింగ్ దాడిని ప్రారంభించిన దీపక్ చాహర్.. తొలి బంతికే షాంటో (0)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. చాహర్ వేసిన డెలివరీని డీప్ థర్డ్ వైపు పంపేందుకు షాంటో ప్రయత్నించాడు. అతని ప్రయత్నం విఫలమవడంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. స్లిప్స్లో ఉన్న రోహిత్ వైపు వెళ్లింది. అతను సులభంగా దాన్ని పట్టేయడంతో బంగ్లా జట్టు 0/1తో తమ ఇన్నింగ్స్ ఆరంభించింది.
ఆ వెంటనే మరో వికెట్ పడకుండా లిటాన్ దాస్ (15 నాటౌట్), అనాముల్ హక్ (14) జాగ్రత్త పడ్డారు. ఈ జోడీ 9వ ఓవర్ వరకు మరో వికెట్ పడనివ్వలేదు. పదో ఓవర్లో బంతి అందుకున్న మహమ్మద్ సిరాజ్ కూడా అవుట్ సైడ్ ఎడ్జ్ కోసం ప్రయత్నించాడు. అయితే అనాముల్ హక్ ఆ వలలో పడలేదు. సిరాజ్ వేసిన బంతిని మిడ్వికెట్ వైపుగా కొట్టాడు. ఆ సమయంలో షార్ట్ మిడ్వికెట్ దరిదాపుల్లో ఫీల్డింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ వేగంగా రియాక్ట్ అయి ఆ క్యాచ్ పట్టేశాడు. దీంతో బంగ్లా జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో పది ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ లిటాన్ దాస్తోపాటు షకీబల్ హసన్ ఉన్నాడు.