
ఢిల్లీ: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారితో ఏర్పడిన లాక్డౌన్ కారణంగా ఎవరి ఇంట్లో వారే ప్రార్థనలు చేసుకున్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు హలీమ్, బిర్యానీ, సేమియా పాయసం లాంటి ప్రత్యేక వంటకాలను తయారుచేసుకున్నా.. వైరస్ కారణంగా తమ ఆత్మీయులను ఇంటికి పిలిచి వడ్డించే వీలులేకుండా పోయింది. దీంతో కొందరు విన్నూతంగా ఆలోచించి బంధువులను, స్నేహితులను తృప్తిపరిచారు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ కూడా తన ఆత్మీయులకు కోసం వినూత్నంగా ఆలోచించాడు.
మటన్ బిర్యానీ, సేమియా పాయసం, డెజర్ట్స్ను టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రికి మహ్మద్ షమీ ప్రత్యేకంగా పంపించాడు. అయితే అది స్వయంగానో లేదా కొరియర్ ద్వారానో మాత్రం కాదు. షమీ పంపింది సోషల్ మీడియాలో. ట్విటర్లో తను పంపించిన ఫుడ్ ఐటమ్స్కు సంబంధించిన ఫోటోను షమీ జత చేశాడు. 'రవి భాయ్.. సేమియా పాయసం, మటన్ బిర్యానీ, డెజర్ట్స్లను ప్యాక్ చేసి పంపించాను. కొద్దిసేపట్లో మీ దగ్గరికి వస్తుంది. స్వీకరించండి' అంటూ షమీ ట్వీట్కు కాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అయింది. అంతకుముందు తన అభిమానులకు, సహచర క్రికెటర్లకు సోషల్ మీడియా వేదికగా ఈద్ శుభాకాంక్షలు తెలిపాడు.
మరోవైపు రవిశాస్త్రి లాక్డౌన్ వేళ ఇంటికే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఖాళీ సమయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారో తెలియజేస్తూ ట్విటర్లో రెండు ఫొటోలు పంచుకున్నారు. అందులో ఐసీసీ కొత్త నిబంధనలను ఉద్దేశించి సోషల్ డిస్టెన్సింగ్పై జోక్ చేశాడు. ఐసీసీ కొత్త రూల్స్లో భాగంగా జట్టులో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే.. ఎలా ఉంటుందో అని తెలియజేసేలా శాస్త్రి ఐదు శునకాలతో కూర్చొని ఉన్న ఫొటోను పంచుకున్నాడు. మరో ఫొటోలో ఒక శునకం స్టైల్గా కళ్లద్దాలు పెట్టుకొని నడిచివెళ్తోంది. దాన్ని సారథిగా వర్ణిస్తూ గ్రౌండ్ పరిశీలనకు వెళ్తుందని చమత్కరించాడు. ఈ ట్వీట్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంది.
కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నిర్వహించడానికి సమయం ఉండకపోవచ్చు అని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇటీవల అన్నాడు. 'నేను ఐపీఎల్ సాధ్యాసాధ్యలపై ఇర్ఫాన్ పఠాన్ భాయ్తో మాట్లాడుతూనే ఉన్నా. కరోనా కారణంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ 2020 నిర్వహించడానికి సమయం ఉండకపోవచ్చు. ఇక్కడ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతీది ఆగిపోయింది. ప్రతీ టోర్నీని రీషెడ్యూల్ చేయడమే కనిపిస్తుంది. దాంతో ఈ ఏడాది ఐపీఎల్ జరగదనేది నా అభిప్రాయం. ఏం జరుగనుందో చూడటం మాత్రమే మనం చేయాల్సింది. ఒకవేళ లాక్డౌన్ తొందరగా ముగిసిపోతే అప్పుడు ఐపీఎల్ గురించి ఏమైనా ఆలోచించవచ్చు' అని షమీ అన్నాడు.