దుబాయ్: కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో ఇంట్లో గడిపిన నాలుగు నెలల కంటే.. యూఏఈలో ఆరు రోజుల క్వారంటైన్ సమయం ఎంతో నరకంగా అనిపించిందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ పేర్కొన్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు జరగనున్నాయి. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికల్లో మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్ల్ని నిర్వహించనున్నారు. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి.
బీసీసీఐ నిబంధనల ప్రకారం యూఏఈలో క్వారంటైన్ పూర్తిచేసుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేసర్ మహమ్మద్ షమీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. క్వారంటైన్ అనుభవాలను అతడు తాజాగా పంచుకున్నాడు. 'లాక్డౌన్ సమయంలో ఆ నాలుగు నెలలు అందరికీ కష్టంగా అనిపించింది. అయితే ప్రాక్టీస్ చేసుకునేందుకు సొంత వసతులు ఉండడం నా అదృష్టం. యూఏఈ వచ్చాక ఆరు రోజులు క్వారంటైన్లో ఉన్నా. ఆ నాలుగు నెలల కంటే.. ఈ ఆరు రోజులే నరకంగా గడిచాయి' అని షమీ తెలిపాడు.
'ఆ నాలుగు నెలలు ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తూ బిజీగా బిజీగా ఉండేవాడిని. మొదట్లో నా సోదరులతో కలిసి సాధన చేశా. ఇక్కడికి వచ్చే ముందు భారత ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేశాను. కానీ క్వారంటైన్లోని ఆ ఆరు రోజులు ఊరికే ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం మళ్లీ మైదానంలోకి దిగడంతో సంతోషంగా ఫీలవుతున్నా. ఇక్కడ మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. జట్టు విజయాల్లో భాగమవుతా' అని మహమ్మద్ షమీ చెప్పాడు.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. 'గత ఐదు-ఆరు నెలల నుంచి ఇంటికే పరిమితమయ్యాం. ఎప్పుడూ అభిమానులకు అందుబాటులోనే ఉంటూ గడిపా. నా యూట్యూబ్ చానల్ పని చేసుకుంటూ దాన్ని ఆస్వాదించా. అదే సమయంలో ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్లో కూడా పాల్గొన్నా. కానీ దుబాయ్లో గడిపిన ఆరో రోజులు గడిపిన క్వారంటైన్ సమమం మాత్రం చాలా చెత్తగా గడిచింది. ఇది నా జీవితంలోనే అత్యంత చెత్త సమయంగా చెప్పొచ్చు' అని అశ్విన్ పేర్కొన్నాడు.
Harbhajan Singh: '2 లేదా 20 కోట్లా అన్నది ముఖ్యం కాదు.. కుటుంబ విలువవలకే భజ్జీ ప్రాధాన్యం'