భారీ స్కోరును ఆశించినా..
ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్. మనోళ్లు టాస్ గెలిచారు. బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఇక మన బ్యాట్స్మెన్లందరూ వీరబాదడు బాదేస్తారని, స్కోరు 400 పరుగులు దాటేస్తుందనీ అంచనా వేశారు. ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలతోనే టీవీ ముందు కూర్చున్నారు. టీమిండియా బ్యాటింగ్ మాత్రం ఏ మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు ఆఫ్ఘన్ ఆటగాళ్లు. పరుగులను రాబట్టుకోవడానికి తొలి ఓవర్ నుంచే శ్రమించాల్సి వచ్చింది టీమిండియా బ్యాటింగ్ పులులకు. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ 10 బంతులను ఎదుర్కొని ఒక్క పరుగే చేయగలిగాడంటే ఆఫ్ఘన్ బౌలింగ్, ఫీల్డింగ్ ఎంత పకడ్బందీగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
గేరు మార్చడానికి కష్టపడ్డ బ్యాట్స్మెన్లు
అంతకుముందు మ్యాచ్లో ఇంగ్లండ్పై భారీగా పరుగులు సమర్పించుకున్న ఆఫ్ఘన్ బౌలర్లు..భారత్తో మ్యాచ్లో పకడ్బందీగా బౌలింగ్ చేశారు. అదే స్థాయిలో ఫీల్డర్లను మోహరింపజేశారు. పరుగులను సాధించడానికి టీమిండియా బ్యాట్స్మెన్లు చెమటోడ్చాల్సి వచ్చింది. తొలి నాలుగు ఓవర్లలో టీమిండియా కేవలం ఏడు పరుగులను మాత్రమే చేసి, రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయింది. ఆ తరువాత ఎక్కడా గేరు మార్చలేకపోయింది. టీమిండియాలో టాప్ ఆర్డర్లో కేప్టెన్ విరాట్ కోహ్లీ, మిడిలార్డర్లో కేదార్ జాదవ్ మాత్రమే అర్ధసెంచరీలను అందుకోగలిగారు. 63 బంతుల్లో అయిదు ఫోర్లతో 67 పరుగులు చేసిన కోహ్లీ నబీ బౌలింగ్లో రహమత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిడిలార్డర్లో కేదార్ జాదవ్ ఆదుకోకపోయి ఉంటే పరిస్థితి 200 మార్క్ను కూడా అందుకోవడం కష్టతరం అయ్యేది. 68 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్తో 52 పరుగులు చేశాడు.
ధనాధన్ ధోనీ సైతం
కోహ్లీ, జాదవ్ తరువాత టీమిండియా బ్యాటింగ్లో ఓపెనర్ కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ స్కోరును సాధించగలిగారు. కేఎల్ రాహుల్ 53 బంతుల్లో రెండు ఫోర్లతో 30 పరుగులు, విజయ్ శంకర్ 41 బంతుల్లో రెండు ఫోర్లతో 29 పరుగులు చేశారు. 52 బంతుల్లో మూడు ఫోర్లతో ధోనీ 28 పరుగులు చేసి, స్టంప్ అవుట్ అయ్యాడు. టెయిలెండర్లలో హార్ధిక్ పాండ్య-7, మహమ్మద్ షమీ-1 పరుగులు చేసి, పెవిలియన్ బాట పట్టారు.
పట్టుదలతో ఆడిన ఆఫ్ఘన్..
225 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ పట్టుదలతో ఆడింది గానీ.. తన రన్రేట్ను మెరుగుపర్చుకోలేకపోయింది. రన్ రేట్ కోసం భారీ షాట్లను ఆడిన ప్రతీసారీ వారి బ్యాటింగ్ గతి తప్పింది. భారీ షాట్లకు ప్రయత్నించి అవుట్ అవుతూ వచ్చారు బ్యాట్స్మెన్లు. దీనితో సింగిల్స్పైనే దృష్టి పెట్టారు. మరోవంక- టీమిండియా బౌలర్లు.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు సాధించడానికి ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్లు సైతం శ్రమించాల్సి వచ్చింది. ఆప్ఘన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఓ మోస్తరుగా పరుగులు చేసినప్పటికీ.. ఎక్కువ బంతులను తీసుకోవాల్సి వచ్చింది. ఓపెనర్లు హజ్రతుల్లా 24 బంతుల్లో ఒక ఫోర్తో 10, గుల్బదీన్ నబీ 42 బంతుల్లో రెండు ఫోర్లతో 27, రహమత్ షా 63 బంతుల్లో మూడు ఫోర్లతో 36, అస్ఘర్ ఆఫ్ఘన్ ఎనిమిది పరుగులు చేయగలిగారు. మిడిలార్డర్లో మహమ్మద్ నబీ 55 బంతుల్లో 52 పరుగులు చేశాడు.
చివరి ఓవర్లో హ్యాట్రిక్..
ఆఫ్ఘనిస్తాన్ తన చివరి ఓవర్లో వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. చివరి ఆరు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో బంతిని అందుకున్న మహమ్మద్ షమీ హ్యాట్రిక్ తీసుకున్నాడు. మూడో బంతికి మహమ్మద్ నబీని అవుట్ చేశాడు. షమీ బౌలింగ్లో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన నబీ హార్ధిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నాలుగో బంతికి ఆఫ్తాబ్ ఆలమ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అలాగే అయిదో బంతికి ముజీబుర్ రెహ్మాన్ వికెట్లను గిరాటేశాడు. దీనితో ప్రపంచకప్ టోర్నమెంట్లో హ్యాట్రిక్ అందుకున్న రెండో భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. 1987లో భారత పేసర్ చేతన శర్మ.. న్యూజీలాండ్పై తొలిసారిగా హ్యాట్రిక్ నమోదు చేశాడు. ప్రపంచకప్లో హ్యాట్రిక్లకు ఆద్యుడు చేతన్ శర్మ. మూడు వరుస బంతుల్లో ముగ్గురు బ్యాట్స్మెన్లను క్లీన్ బౌల్డ్ చేశాడు.
మ్యాచ్ మొత్తానికీ రెండే సిక్సర్లు..
భారత్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ మొత్తానికీ రెండే సిక్సర్లు నమోదు అయ్యాయి. టీమిండియాలో కేదార్ జాదవ్ ఒక్కడే సిక్స్ కొట్టాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్లో మహమ్మద్ నబీ సిక్సర్ సాధించాడు. తమ ఇన్నింగుల్లో సిక్సర్లు సాధించిన ఆ ఇద్దరు బ్యాట్స్మెన్లు సరిగ్గా 52 పరుగులు చేసి అవుట్ కావడం విచిత్రం.