హైదరాబాద్: గత కొన్ని రోజులుగా భార్య హాసిన్ జహాన్ చేస్తున్న ఆరోపణలతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి మాజీ క్రికెటర్ కపిల్దేవ్ అండగా నిలిచాడు. షమీపై అతడి భార్య చేస్తోన్న ఆరోపణలపై కపిల్ దేవ్ స్పందించాడు.
క్రికెటర్ షమీ కేసులో మరో మలుపు: బీసీసీఐ సాయం తీసుకోనున్న భార్య
షమీ మోసగాడని, ఇతర మహిళలతో సంబంధాలున్నాయని, ఓ పాకిస్థానీ మహిళ నుంచి డబ్బు తీసుకున్నాడని, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఆమె చేస్తున్న ఆరోపణలను ఖండించారు. అతడి భార్య హాసీన్ జహాన్ చేస్తోన్న ఆరోపణల్లో నిజముంటే, ఇంత ఆలస్యంగా స్పందించడమేంటని ప్రశ్నించారు.
'హాసీన్ రెండు సంవత్సరాల నుంచి తన జీవితంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే ఇంత ఆలస్యంగా ఎందుకు బయటకు తీసుకువచ్చింది. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని, తనను చంపేందుకు ప్రయత్నించాడని ఏవేవో ఆరోపణలు చేస్తోంది. ఎప్పుడో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడితే ఇప్పటి వరకు ఎందుకు నోరు విప్పలేదు' అని కపిల్ ప్రశ్నించాడు.
'భర్తతో సంబంధాలు బాగానే ఉన్నంత వరకు ఏమీ చెప్పరా? అదే సంబంధం సరిగా లేకపోతే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తారా?' అని మండిపడ్డాడు. షమీ గురించి తనకు తెలుసునని.. అతడు అలాంటి వాడు కాదని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. 'హాసీన్ చేసిన వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజం లేదు. షమి ఎంతో ప్రతిభ గల ఆటగాడు. కష్టపడే మనస్తత్వం అతనిది' అని కపిల్ అన్నాడు.
'అతడి వ్యక్తిగత జీవితంలో ఏవో సమస్యలు ఉన్నాయని నాకూ తెలుసు. కానీ, అతని భార్య ఇలా ఆరోపించడం ఏమాత్రం బాగోలేదు. రంగంలోకి దిగిన ఇన్వెస్టిగేషన్ టీమ్ తన పని తాను చేసుకుపోతుంది. ఒకవేళ దర్యాప్తులో షమీ తప్పు చేసినట్లు రుజువైతే.. షమి చేసిన దాన్ని ఎవరూ ఆమోదించలేరు' అని కపిల్దేవ్ అన్నాడు.
షమీపై అతడి భార్య హసీన్ జహాన్ తన న్యాయవాదితో కలిసి కోల్కతా పోలీస్ కమిషనర్ను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం షమితో పాలు మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే మిగతా నలుగురి పేర్లు వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు.
ఐపీసీ 498ఏ, 323, 307, 376, 506, 328, 34 సెక్షన్ల కింద షమీపై ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసును లాల్ బజార్ పోలీస్ స్టేషన్కు చెందిన డిటెక్టివ్ విభాగం తన చేతుల్లోకి తీసుకుంది. షమీ కేసును విమెన్స్ గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరపనున్నట్టు కోల్కతా పోలీసులు తెలిపారు.