హైదరాబాద్: టీమిండియా పేసర్ మహ్మద్ షమికి వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వస్తోన్న ఆరోపణల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని తీవ్రంగా ఆరోపిస్తోంది అతని భార్య హసీన్ జహాన్. అయితే తాజాగా పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలిసేందుకు ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి విజ్ఞప్తిని కూడా పంపింది. ఈ నెల 23న ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో షమి కారణంగా తాను ఎదుర్కొంటున్న దుస్థితిని వివరిస్తానని ఆమె వెల్లడించారు.
సోమవారమే పశ్చిమ్బంగ సీఎంను కలిసేందుకు మమత నివాసానికి జహాన్ వెళ్లారు. సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని అధికారులను కోరారు. అయితే సీఎం నివాసంలో లేకపోవడంతో జహాన్ వెనుదిరిగారు. అయితే శుక్రవారం తాను మమతను కలవనున్నట్లు బుధవారం వెల్లడించారు.
మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఇంగ్లాండ్కు చెందిన ఓ వ్యాపారి నుంచి డబ్బులు తీసుకున్నాడని కూడా ఆమె అరోపించింది. ఈ నేపథ్యంలో షమి దుబాయ్లో పర్యటించడంపై సమాచారం కోరగా బీసీసీఐ స్పందించింది. ''బీసీసీఐ నుంచి మాకు లేఖ అందింది. షమి ఫిబ్రవరి 17, 18వ తేదీల్లో దుబాయ్లో ఉన్నట్లు తెలిపింది. ఇతర అంశాలపైనా విచారణ జరుపుతున్నాం'' అని జాయింట్ కమిషనర్ ప్రవీణ్ త్రిపాఠి చెప్పాడు.
తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని.. వెంటనే చర్యలు తీసుకుని అతని కుటుంబసభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహ్మద్ షమి గత నెల 17, 18వ తేదీల్లో దుబాయ్లో ఉన్నట్లు బీసీసీఐ ధ్రువీకరించింది. పాకిస్థాన్ మోడల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న షమి.. గత నెలలో దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన అనంతరం ఆమెను కలిసేందుకు దుబాయ్ వెళ్లాడని భార్య హసీన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.