
హైదరాబాద్: అక్రమ సంబంధాలు, గృహ హింస, హత్యాయత్నం కింద పలు కేసులు మోపబడిన షమీ ఆదివారం మీడియా ముందుకు వచ్చాడు. ప్రముఖ మీడియా 'టైమ్స్ నౌ' ద్వారా తన మనోగతాన్ని పంచుకున్నాడు. సాక్ష్యాధారాలతో నిరూపించాలని లేదా తప్పొప్పుకుని తిరిగి ఇంటికి రావాలని భార్యను కోరుతున్నాడు.
తాను మీడియాతో మాట్లాడుతూ.. 'నా భార్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. విచారణలో నాపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఒకవేళ అవన్నీ అబద్ధమని తేలితే.. హసీన్ జవాబు చెప్పాలి. ఇది కుటుంబ సమస్య కాబట్టి.. ఇద్దరం కలిసి కూర్చుని పరిష్కరించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా' అని షమీ చెప్పాడు.
'ఎవరి గురించైనా ఏదైనా మాట్లాడటం తేలికే. నాపై చేసిన ఆరోపణల్ని తను నిరూపించాల్సి ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది, తను అపార్థం చేసుకుంది. కానీ అవన్నీ పక్కనబెట్టి కుటుంబం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నా'' అని తెలిపాడు.
షమీపై హసీన్ జహాన్ కేసు నమోదు చేయడం వల్ల త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్లో అతడు ఆడేది అనుమానంగా మారింది. ఈ పేస్ బౌలర్ విషయంలో అతడు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఢిల్లీ డేర్డెవిల్స్ బీసీసీఐ అధికారులతో చర్చలు జరుపుతోంది. ఇందుకు ఆధారాలుగా షమీ చాటింగ్ స్క్రీన్ షాట్లను ఫేస్బుక్లో పోస్ట్ చేసిందామె.
వాటిని సైతం ఫేస్బుక్ డిలీట్ చేయడంతో ఆమె ఎందుకు తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. భార్య ఆరోపణల కారణంగా షమీ బీసీసీఐ వార్షిక కాంట్రాక్టును దక్కించుకోలేక పోయాడు.