భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీని ప్రశంసించాడు. రోహిత్ శర్మ ప్లేయర్లను అర్థం చేసుకునే నాయకుడని ప్రశంసించాడు. రోహిత్ వద్ద ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీ ఉంటుందని తెలిపాడు. సిరాజ్ గత ఏడాదిన్నరగా.. కన్సిస్టెన్సీ ప్రదర్శనతో టీమిండియా టెస్ట్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు.
ఇకపోతే విరాట్ కోహ్లీ నుంచి గత ఏడాది చివరిలో పరిమిత ఓవర్లలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్.. ఈ ఏడాది జనవరిలో కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీని కూడా వదులుకోవడంతో ఆల్-ఫార్మాట్ కెప్టెన్గా రోహిత్ నియమితుడయ్యాడు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా మూడు పరిమిత ఓవర్ల సిరీస్ విజయాలు నమోదు చేసింది. ఇక టెస్ట్ కెప్టెన్సీలోనూ సత్తా చాటడానికి రోహిత్ సిద్ధమవుతున్నాడు.
మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ.. 'రోహిత్కు ప్లేయర్ల మానసిక స్థితిని అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంది. బౌలింగ్లో మాకు కాస్త కష్టంగా అన్పించినప్పుడు అతను మా వద్ద ప్లాన్ బీతో వస్తాడు.
మళ్లీ మెరుగైన ప్రదర్శన చేసేలా ఎంకరేజ్ చేస్తాడు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే కెప్టెన్ నాయకత్వంలో పనిచేయడం మంచి అనుభూతి' అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున ఈ సారి ఐపీఎల్లో సిరాజ్ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. బౌలింగ్లో 10.08ఎకానమీతో బౌలింగ్ చేసి తొమ్మిది వికెట్లు మాత్రమే తీశాడు. క్వాలిఫయర్ 2లో ధారాళంగా పరుగులివ్వడంతో సిరాజ్ పై విమర్శలు కూడా తీవ్రమయ్యాయి.
అయితే ఏ బౌలర్కైనా ఒకానొక దశలో ఫామ్ కోల్పోవడం సహజం. ఇకపోతే ఇంగ్లాండ్తో రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా జట్టులో సిరాజ్ ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ టూర్లో మళ్లీ తన ఫామ్ అందుకోవడానికి సిరాజ్ సన్నద్ధమవుతున్నాడు. లార్డ్స్, ఓవల్లలో జరిగిన టెస్టుల్లో విజయాలతో భారత్ ఈ సిరీస్లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉంది. నాటింగ్హామ్లో జరిగిన ఓపెనింగ్ గేమ్లో వర్షం ద్వారా ఆట డ్రాగా ముగిసింది. ఇకపోతే చివరిదైనా అయిదో మ్యాచ్లో భారత్ గెలిస్తే 2007-08సీజన్ తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై భారత్కు ఇది తొలి టెస్టు సిరీస్ విజయం అవుతుంది.