ఇస్లామాబాద్: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు మరో ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు లైన్ క్లియర్ అయింది. తొలిసారి నిర్వహించిన కరోనా పరీక్షలో పది మంది క్రికెటర్లకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కాగా.. తాజాగా మరోసారి టెస్టు చేయగా ఆరుగురికి నెగెటివ్గా తేలింది. దీంతో ఇంగ్లండ్లో ఉన్న పాక్ జట్టుతో కలిసేందుకు ఈ ఆరుగురు అర్హత సాధించారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
మొదటగా ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కరోనా వైరస్ టెస్టులు నిర్వహించగా.. 10 మందికి వైరస్ సోకినట్టు వెల్లడైంది. రెండో సారి నిర్వహించిన పరీక్షల్లో ఆరుగురికి నెగిటివ్గా వచ్చింది. ఫఖర్ జమాన్, మహ్మద్ హస్నేన్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ రిజ్వాన్, షాదబ్ ఖాన్, వాహబ్ రియాజ్లకు తాజాగా మరోసారి నెగిటివ్ వచ్చింది. నాలుగు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లోనూ వీరికి నెగిటివ్ రిపోర్టులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆరుగురు ఇంగ్లండ్ పర్యటనకు త్వరలో వెళ్లనున్నారు.
మరోవైపు ఈ ఆరుగురిలో ఒకడైన సీనియర్ ఆల్రౌండర్ మహ్మద్ హఫీజ్ తనకు తొలిసారి పీసీబీ నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్గా తేలడంతో వెంటనే ప్రైవేటులో మరోసారి పరీక్షలు చేసుకున్నానని, అందులో నెగిటివ్గా వచ్చిందని ట్వీట్ చేశాడు. దీంతో ఈనెల 26న పీసీబీ రెండోసారి పరీక్షలు నిర్వహించింది. అప్పుడు కూడా అతనికి నెగిటివ్గా తేలింది. ఇప్పుడు మరోసారి కూడా హఫీజ్కు నెగిటివ్గా నిర్ధారణ కావడంతో పీసీబీ అతడిని ఇంగ్లండ్కు పంపేందుకు అంగీకారం తెలిపింది.
మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం పాక్ జట్టు గత ఆదివారం రాత్రి ఇంగ్లండ్కు చేరుకున్న విషయం తెలిసిందే. మాంచెస్టర్కు చేరుకున్న 31 మంది సభ్యుల పాక్ బృందం వొస్టర్షైర్లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. క్వారంటైన్ పూర్తైన తర్వాత ఆటగాళ్లకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఆతిథ్య జట్టుతో సిరీస్ సన్నాహాల కోసం జూలై 13న పాక్ టీమ్ డెర్బీషైర్కు వెళ్లనుంది.
డీఆర్ఎస్కు ధోనీ వీరాభిమాని కాదు.. కోహ్లీ మాత్రం..: ఆకాశ్చోప్రా