మళ్లీ పాజిటివ్:
మొదటగా ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపికైన 29 మంది పాక్ క్రికెటర్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కరోనా వైరస్ టెస్టులు నిర్వహించగా.. 10 మందికి వైరస్ సోకినట్టు వెల్లడైంది. అందులో సీనియర్ ఆల్రౌండర్ మహమ్మద్ హఫీజ్ పేరు కూడా ఉంది. ఆ మరుసటి రోజు మరోసారి హఫీజ్ వ్యక్తిగతంగా పరీక్షలు చేయించుకోగా.. నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అతడు ట్విటర్లో వెల్లడించాడు. దీంతో అతను క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. స్వీయ నిర్బంధంలో ఉండకుండా హఫీజ్ మళ్లీ పరీక్షలు చేయించుకోవడంపై గుర్రుగా ఉన్న పీసీబీ తాజాగా తిరిగి టెస్టులు నిర్వహించగా.. ఈ సారి మళ్లీ పాజిటివ్ అని తేలినట్లు సమాచారం.
క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం:
మొదట చేయించిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్గా తేలిన 10 మందికి సంబంధించిన వివరాలను శనివారం వెల్లడించనున్నట్లు పీసీబీ చెందిన ఓ అధికారి తెలిపారు. ఇక బోర్డు వైద్య సిబ్బంది పాజిటివ్గా నిర్ధరించినా హఫీజ్ దాన్ని అనుసరించి క్వారంటైన్కు వెళ్లకపోవడం పట్ల పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కరోనా పాజిటివ్గా తేలిన ఆటగాళ్లకు పీసీబీ వైద్య సిబ్బంది నుంచి సహకారం అందట్లేదంటూ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ మండిపడ్డాడు. గత రెండు రోజుల నుంచి సలహాలు, సూచనల కోసం ఆటగాళ్లు పీసీబీ వైద్య సిబ్బందికి ఫోన్ చేసినా.. స్పందించలేదని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నాడు.
హాఫీజ్ తొందరపాటు అసంతృప్తికి గురిచేసింది:
హాఫీజ్ తొందరపాటుతో తమకు సమస్యను సృష్టించాడని, ఇది ముమ్మాటికి బోర్డు క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించడమేనని ఇప్పటికే పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ మండిపడ్డాడు. 'హఫీజ్తో నేను మాట్లాడాను. అతని తొందరపాటు పీసీబీని పూర్తిగా అసంతృప్తికి గురిచేసింది. వ్యక్తిగతంగా కరోనా వైరస్ టెస్టు చేసుకునే హక్కు అతనికి ఉంది. కానీ.. టెస్టు ఫలితాన్ని తొలుత పీసీబీకి చెప్పి ఉండాల్సింది. అలాకాకుండా.. అతనే స్వయంగా ప్రకటించి.. బోర్డుకు ఓ సమస్యను సృష్టించాడు. గతంలోనూ అతను క్రమశిక్షణ తప్పి మందలింపునకు గురయ్యాడు. అతను బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్లో లేడు. కానీ పాక్ జట్టుకు ఎంపికయ్యాడు. కాబట్టి బోర్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఓ పెద్ద సమస్యను సృష్టించిన అతని వ్యవహారంపై ఏమి చేయవచ్చనే దానిపై చర్చలు జరుపుతున్నాం' అని వసీమ్ ఖాన్ వెల్లడించాడు.
55 టెస్టులు, 218 వన్డేలు:
2003లో పాకిస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేసిన మహ్మద్ హఫీజ్.. ఇప్పటి వరకు 55 టెస్టులు, 218 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 21 సెంచరీలు బాదాడు. మొత్తంగా 12,258 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్లోనూ 246 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు మాలిక్ 35 టెస్టులు, 287 వన్డేలు, 113 టీ20లు ఆడాడు. హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్కు త్వరలోనే వీడ్కోలు పలకనున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించే ముందు ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహించాలనుందని 39 ఏళ్ల హఫీజ్ తెలిపాడు. మెగా టోర్నీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు చెప్పబోతున్నట్లు హఫీస్ స్పష్టం చేశాడు.