అవకాశం వస్తే ఎగిరి గంతేస్తా:
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ... 'భారత జట్టుకు కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అవకాశమిస్తే ఏమాత్రం ఆలోచించకుండా బాధ్యతలు స్వీకరిస్తా. ఆ అవకాశం వస్తే ఎగిరి గంతేసి మరీ అందుకుంటా. ఈ రోజుల్లో చాలా మంది సహాయక సిబ్బంది జట్టుతో ప్రయాణిస్తున్నారు. అంత మంది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. నాలాంటి వ్యక్తులు కోచ్గా ఉంటే స్పెషలైజేషన్ బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచింగ్ కూడా ఇస్తాను. నేను కోచ్గా ఉంటే ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్ అక్కర్లేదు' అని అన్నారు.
ఐపీఎల్ వాయిదా వేయడం మంచిదే:
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో క్రికెటర్ల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 2020ను వాయిదా వేయడం మంచిదే అని మహ్మద్ అజహరుద్దీన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది రెట్టింపు ఉత్సాహంతో ఐపీఎల్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ నిర్వహించలేని పక్షంలో ఐపీఎల్ జరుపడంపై బీసీసీఐ ఆలోచిస్తుందని తాను అనుకుంటున్నా అని అజ్జూ భాయ్ చెప్పారు.
కల నెరవేరే అవకాశం ఉంది:
టీమిండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రి సేవలు 2021లో టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగుతాయి. ఆ తర్వాతే మరొకరికి అవకాశం ఉంటుంది. రవిశాస్త్రి ఇప్పటికే రెండు పర్యాయాలు కోచ్గా ఉన్న నేపథ్యంలో ఈసారి ఎంపికయ్యే అవకాశాలు తక్కువే. మరి అజ్జూ భాయ్ ఆశలు నెరవేరే అవకాశం ఉంది. 99 టెస్టులు ఆడిన అజ్జూభాయ్ 6215 పరుగులు, 334 వన్డేల్లో 9378 పరుగులు చేసి విజయవంతమైన కెప్టెన్ గా కూడా ప్రశంసలు అందుకొన్నారు. రెండు ఫార్మాట్లలో కలిపి 29 సెంచరీలు బాదారు.
21 ఏళ్ల వయసులో అరంగేట్రం:
మహ్మద్ అజహరుద్దీన్ భారత టెస్టు జట్టులోకి 21 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసారు. ఆడిన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటికీ ఆ రికార్డు అలానే ఉంది. కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. 2000లో ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. 2000లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సిరీస్లో కొన్ని మ్యాచ్లు ఫిక్సింగ్కి గురవగా.. అందులో అజహరుద్దీన్ పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. సచిన్ (463), ధోనీ (350), ద్రవిడ్ (344) తర్వాత అజహరుద్దీనే (334) అత్యధిక మ్యాచ్లు ఆడారు. అలాగే భారత సారథిగా 174 వన్డేల్లో, 47 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించారు.