హైదరాబాద్: టీ20 ఫార్మాట్లో అదరగొట్టిన ప్లేయర్లు తేలిపోయారు. భారీ అంచనాలతో బరిలోకి దిగి బెంబేలెత్తి తిరుగుపయనమైయ్యారు. ఇంగ్లాండ్లో జరగనున్న 2019 ప్రపంచకప్కే అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంచలనాల అఫ్గానిస్థాన్ పెద్ద ఫార్మాట్లోకి వచ్చేసరికి తేలిపోయింది. బంతితో ఆకట్టుకున్నట్లు కనిపించినా, బ్యాటింగ్ విషయంలో మాత్రం తడబడింది. భారత బౌలర్ల ధాటికి కనీస పోటీ కూడా ఇవ్వలేక రెండు సార్లు ఆలౌటై, 262పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూసింది.
నెట్స్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే ఈ ఫార్మాట్కు అలవాటు పడే అవకాశం ఉంటుందని దిగ్గజాలు సైతం అభిప్రాయపడుతున్నారు. అఫ్గాన్ టెస్టు ప్రదర్శన విషయమై, తాజాగా భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ స్పందిస్తూ అఫ్గానిస్థాన్ టెస్టు మ్యాచ్లకు అలవాటు పడటానికి మరింత సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ ఫార్మాట్లో లోపాలను అధిగమించడానికి భారత్తో టెస్టు వాళ్లకో పాఠం వంటిదని ఆయన పేర్కొన్నాడు.
'జట్టు విషయానికొస్తే అఫ్గానిస్థాన్ మంచి జట్టే. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్కు, టెస్టులకు చాలా తేడా ఉంటుంది. ఈ క్రమంలో ఐసీసీ అఫ్గానిస్థాన్కు టెస్టు హోదా ఇచ్చి కాస్త తొందరపడిందేమోనని నేను అనుకుంటున్నా. వాళ్లకి ఇంకాస్త ఎక్కువ సమయం ఇచ్చి ఉండాల్సింది. తొలి టెస్టే రెండు రోజుల్లో ముగిసిపోవడం వాళ్లని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. వాళ్లు భవిష్యత్తులో చాలా టెస్టులు ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమలోని లోపాలను అధిగమించడానికి ఈ టెస్టు వాళ్లకి ఓ పాఠం లాంటిది. టెస్టు ఫార్మాట్ కోసం వాళ్లు ఆటలో మరింత పురోగతి సాధించాలంటూ' ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చారు.
ఐపీఎల్, బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో ఆకట్టుకున్న యువ బౌలర్ రషీద్ ఖాన్ టెస్టులకొచ్చే సరికి లయ తప్పాడు. వికెట్లు తీయలేక పరుగులు కూడా బాగానే సమర్పించుకున్నాడు. కాగా, ఆశలు పెట్టుకున్న స్పిన్ దళం నిరాశ పరిచినా.. ఫాస్ట్ బౌలర్లు మాత్రం ఆకట్టుకున్నారు. మరోవైపు తొలి టెస్టు మ్యాచ్ కావడంతో కొన్ని లోపాలు ఉండటం సహజం. రానున్న కాలంలో వాటిని అధిగమించి టెస్టు క్రికెట్లో ప్రపంచ స్థాయి జట్టుగా ఎదిగే సత్తా అఫ్గానిస్థాన్కు ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.