హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎన్నికల్లో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాడు. మంగళవారం హెచ్సీఏ అధ్యక్ష పదవికి అజహర్ నామినేషన్ వేస్తున్నట్లు అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
'హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేయాలని అజహర్ నిర్ణయం తీసుకున్నాడు. కోర్టు నిర్ణయంపై బీసీసీఐ అప్పీల్కు వెళ్లలేదు కాబట్టి ఆ తీర్పును గౌరవించినట్లే. పోటీకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు' అని అజహర్ కుటుంబ సభ్యుడొకరు చెప్పారు. హెచ్సీఏలో పారదర్శకత తీసుకొచ్చేందుకే తాను బరిలో దిగుతున్నట్లు అజహర్ అన్నట్లు తెలిసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం టెస్టు మ్యాచ్లాడిన క్రికెటర్లు ఆయా రాష్ట్ర సంఘాల ఎన్నికల్లో ఓటింగ్కు అర్హులు. అయితే హెచ్సీఏ ఎన్నికల్లో ఓటర్ల నమోదు గడువు ఆదివారంతో ముగిసింది. ఇందులో ఓటరుగా అజహరుద్దీన్ తన పేరు నమోదు చేసుకోలేదు. దీంతో అజహర్ నామినేషన్ వేసినా అది చెల్లుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇక సిటీ సివిల్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో అడ్హక్ కమిటీ ఛైర్మన్ ప్రకాశ్చంద్ జైన్ ఆధ్వర్యంలో జనవరి 17న హెచ్సీఏకు ఎన్నికలు జరుగుతున్నాయి. న్యాయవాది రాజీవ్రెడ్డి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. హెచ్సీఏలో సుమారు 216 క్లబ్లు ఉండగా 200కి పైగా క్లబ్ల కార్యదర్శులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు తెలిసింది.
ఒకవైపు ఎన్నికల్ని వ్యతిరేకిస్తూనే మరోవైపు ప్రస్తుత కార్యవర్గంలోని కొందరు ఆఫీస్ బేరర్లు, ఈసీ సభ్యులు సైతం ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకుంటుండటం గమనార్హం. హెచ్సీఏ ప్రస్తుత కార్యదర్శి జాన్ మనోజ్ కూడా కొన్ని పదవులకు నామినేషన్ వేసినట్లు సమాచారం.
ఇటీవలే టీమిండియా 500వ టెస్టులో సన్మానం సహా గతంలో కొన్ని బోర్డు కార్యక్రమాలకు అజహర్ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించింది. 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్ను నిర్దోషిగా తేల్చింది. భారత్ తరఫున అజహర్ 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు.