కొంచెం ఆందోళన చెందాం:
తాజాగా మహ్మద్ అసిఫ్ మాట్లాడుతూ... '2006లో పాకిస్థాన్కు వచ్చిన భారత జట్టుకు పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉంది. రాహుల్ ద్రవిడ్ అప్పటికే చాలా పరుగులు చేశాడు. వీరేందర్ సెహ్వాగ్ ముల్తాన్ టెస్టులో మమ్మల్ని చితకొట్టాడు. ఫైసలాబాద్ టెస్టులో ఇరు జట్లు 600 పరుగులు సాధించాయి. భారత బ్యాటింగ్ లైనప్ లోతుగా ఉండటంతో కొంచెం ఆందోళన చెందాం. ఎంఎస్ ధోనీ అప్పట్లో ఏడు లేదా ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. అక్కడి వరకు టీమిండియాకు బ్యాట్స్మన్లు ఉన్నారు' అని తెలిపాడు.
సచిన్ కళ్లు మూసుకోవడాన్ని చూశా:
'మూడోదైన కరాచీ టెస్ట్ ప్రారంభంలోనే ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. దాంతో పాక్ ఒత్తిడిలో పడింది. అయితే కమ్రాన్ అక్మల్ సెంచరీతో చేయడంతో పాక్ కోలుకుంది. చివరకు మొదటి ఇన్నింగ్స్లో పాక్ 240 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం మేం బౌలింగ్ ఆరంబించాం. షోయబ్ అక్తర్ మెరుపు బౌన్సర్లని సంధించాడు. నేను స్క్వేర్ లెగ్లో అంపైర్కి సమీపంలో ఫీల్డింగ్ చేస్తుండగా.. అక్తర్ విసిరిన ఓ 2-3 బౌన్సర్లకి క్రీజులో ఉన్న సచిన్ కళ్లు మూసుకోవడాన్ని చూశాను. కొందరు బ్యాక్ఫుట్పై ఆడేందుకు ట్రై చేశారు కానీ.. మేము అవకాశం ఇవ్వలేదు' అని మహ్మద్ అసిఫ్ చెప్పాడు.
341 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం:
ఫస్ట్ ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 240 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం పాక్ బౌలింగ్ దాడికి పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ 238 పరుగులు మాత్రమే చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో పాక్ 599 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ తడబడింది. ఫలితంగా 341 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ను పాక్ 1-0తో గెలుచుకుంది. ముల్తాన్, ఫైసలాబాద్ టెస్టుల్లో పరుగుల వరద పారడంతో అవి 'డ్రా'గా ముగిసాయి. భారత ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ మూడో టెస్ట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించాడు.
గంటకి 161.3కిమీ వేగం:
2003 ప్రపంచకప్లో షోయబ్ అక్తర్ సంధించిన బౌన్సర్ని చాకచక్యంగా అప్పర్ కట్ రూపంలో సచిన్ టెండూల్కర్ సిక్స్గా బాదిన విషయం తెలిసిందే. అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
అసిఫ్పై ఏడేళ్ల నిషేధం:
2010లో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిన మహ్మద్ అసిఫ్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఏడేళ్ల నిషేధం పడింది. అప్పటినుంచి అతడు మళ్లీ పాకిస్తాన్ జట్టులో కనిపించలేదు. ఫిక్సింగ్కు పాల్పడిన క్రికెటర్లలో కొంతమందికి తిరిగి జాతీయ జట్టులో ఆడే అవకాశం ఇచ్చినా.. తనకు మాత్రం పీసీబీ రెండో చాన్స్ ఇవ్వలేదని అసిఫ్ ఇటీవలే ఆవేదన వ్యక్తం చేసాడు. తన సహచర బౌలర్ మహ్మద్ అమిర్ కూడా ఫిక్సింగ్లో ఇరుక్కొన్నప్పటికీ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడాన్ని అసిఫ్ పరోక్షంగా ప్రస్తావించాడు. అసిఫ్ పాక్ తరపున 23 టెస్టులు, 38 వన్డేలు, 11 టీ20లు ఆడాడు.