
హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధి పాక్ కనీసం పోరాడకుండా కూడా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పాక్ ఆటతీరుపై ఆ దేశ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. పలువురు నెటిజన్లు పాక్ ఆటగాళ్లను అసభ్య పదాలతో ట్విట్టర్ వేదికగా దూషిస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ ట్విటర్ వేదికగా దయచేసి మమ్మల్ని తిట్టొద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. "దయచేసి మాపై అసభ్య పదాలను ఉపయోగించకండి. మా ప్రదర్శనను విమర్శించండి. అంతే తప్ప అసభ్య పదాలు వాడొద్దు. ఇకపై మేం మంచి ప్రదర్శన చేస్తాం. మాకు మీ మద్దతు కావాలి" అని ట్వీట్ చేశాడు.
ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్థాన్ 89 పరుగులతో ఓడింది. ఈ మ్యాచ్లో మహ్మద్ ఆమిర్ 10 ఓవర్లు వేసిన మూడు వికెట్లు తీసి ఫరవాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆమీర్ పైట్వీట్ చేశాడు.
జట్టులో విభేదాలు, కెప్టెన్తో సత్సంబంధాలు లేకపోవడమే ప్రపంచకప్లో భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలని అక్కడి మీడియా పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆదివారంనాటి మ్యాచ్లో ఓటమి అనంతరం కెప్టెన్ సర్ఫరాజ్ డ్రెస్సింగ్ రూంలో తన అసహనాన్ని ప్రదర్శిస్తూ ఇమద్ వాసిం, ఇమాముల్ హక్ తనతో సహకరించడం లేదని, పరాజయానికి వారే కారణమని పేర్కొన్నట్టు సామ వార్తా చానల్ పేర్కొన్నది.
మరో స్థానిక ఛానెల్ పాక్ జట్టులో గ్రూపులు ఉన్నాయని పేర్కొంటూ కథనాన్ని ప్రసారం చేసింది. ఇక, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ జట్టులో సమస్యలు ఉన్నాయని కొందరు ఆటగాళ్లు తనతో చెప్పారని ఆ సమస్యపై దృష్టి సారించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు హితబోధ చేశాడు. ఇదిలా ఉంటే, పాక్ జూన్ 23న దక్షిణాఫ్రికాతో తదుపరి మ్యాచ్ ఆడనుంది.