నాకు ఇగో లేదు..
భారత మహిళల క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రమేశ్ పవార్తో గొడవపై వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ మరోసారి స్పందించింది. 'నేను కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాను. నాకు ఎలాంటి ఇగో లేదు. భారత్ జట్టుకి ఆడే సమయంలో వ్యక్తిగత ఇష్టా.. అయిష్టాలకి ప్రాధాన్యం ఇవ్వను. ఇండియాకు ఆడటమంటే.. దేశానికి సేవ చెయ్యడమే. కాబట్టి.. వ్యక్తిగత సమస్యలకి నేను ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వను. ఇప్పుడు రమేశ్ పొవార్ కోచ్. అతను టీమ్కి సంబంధించి ప్లాన్స్ వేస్తాడు. ఇద్దరం కలిసి సమన్వయంతో జట్టుని ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం'' అని మిథాలీ రాజ్ స్పష్టం చేసింది.
కీలక ప్లేయర్గా..
టీమ్ఇండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ దూకుడు గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. వయసు 17 ఏళ్లే కానీ.. తాను అరంగేట్రం చేశాక ప్రపంచంలో ఏ మహిళా క్రికెటర్ కొట్టనన్ని సిక్స్లు కొట్టింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో షెఫాలీని పక్కనబెట్టడంతో విమర్శలకు దారి తీసింది. దాంతో షెఫాలీని తిరిగి అన్ని ఫార్మాట్లలోకి తీసుకుంటున్నట్లు సెలెక్షన్ ప్యానెల్ ప్రకటించింది. గత 18 నెలలుగా షార్ట్ ఫార్మాట్లో షెఫాలీ కీలక ప్లేయర్గా సేవలందిస్తోంది.
ప్రతీ సిరీస్లో పాఠాలు..
ప్రతి సిరీస్ నుంచి పాఠాలు నేర్చుకుని ఆటను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తానని షెఫాలీ చెబుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత తన ఫిట్నెస్, ఫీల్డింగ్ కూడా మెరుగుపడ్డాయని ఆమె తెలిపింది. మార్చిలో సౌతాఫ్రికాతో టీ20లో సిరీస్లో ఆమె వరుసగా 23, 47, 60 సాధించింది. ఆ సిరీస్లో బౌన్సర్లను ఆమె గతంలో కంటే మెరుగ్గా ఎదుర్కొంది. కష్టపడడం వల్లే బౌన్సర్లను ఆడడంలో తాను మెరుగుపడ్డానని షెఫాలీ తెలిపింది. "ఏదైనా విషయంలో మెరుగుపడాలని అనుకుని, ఒక్కసారి ప్రయత్నించి వదిలేస్తే ప్రయోజనం ఉండదు. నేను సాధన చేసేటప్పుడు ఒక్కోసారి 150 బౌన్సర్లను కూడా ఎదుర్కొనేదాన్ని. ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని మరిన్ని బౌన్సర్లను ఆడేదాన్ని" అని చెప్పింది.