హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూస్తుంటే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ గుర్తుకొస్తున్నాడని హెడ్ కోచ్ రవిశాస్రి అన్నాడు. ఆనంద్ బజార్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో శాస్త్రి మాట్లాడుతూ మాజీ క్రికెటర్లు, విమర్శకులు వారి పని వారు చూసుకుంటే బాగుంటుందని సూచించాడు.
సఫారీ పర్యటనలో కోహ్లీ దూకుడు గురించి కామెంట్ చేసిన పలువురు మాజీలపై శాస్త్రి విరుచుకుపడ్డారు. 'క్రికెట్ విమర్శకులకు నేను చెప్పేది ఒక్కటే. మీ పని మీరు చూసుకోండి. నేను దీనిని చాలా చిన్న విషయంగా తీసుకుంటా. ఎవరైతే మాట్లాడుతున్నారో.. మీ పని మీరు చేసుకోండి. మా జాబ్ మమ్మల్ని చేసుకోనివ్వండి' అని ఘాటుగా స్పందించాడు.
'నాకు తెలిసి మైదానంలో కోహ్లీ చాలా మామూలుగా ఉంటున్నాడు. అయినా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేందుకు అంపైర్లు ఉన్నారు. మ్యాచ్ రెఫరీలు ఉన్నారు. కాబట్టి నేను విమర్శించేవాళ్లకు చెప్పేది ఒకటే.. మీ పని మీరు చూసుకొండి, ప్రాబ్లమ్ ఎక్కడ ఉంది?' అని శాస్త్రి అన్నాడు.
కోహ్లీ చిన్నవయసులోనే ఎన్నో ఘనతలను సాధించాడని గుర్తు చేశాడు. ఇమ్రాన్కు, కోహ్లీ చాలా పోలికలు ఉన్నాయని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. 'ఇమ్రాన్ ఎల్లపుడ్డూ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించేవాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా.. పోటీతత్వంతో ముందుకు వెళ్లేవాడు. ఆయనలోని శక్తిని నమ్ముకొని జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తారు' అని శాస్త్రి పేర్కొన్నాడు.
'ఇవే పోలికలు విరాట్ కోహ్లీలోనూ నాకు కనిపించాయి. సఫారీ పర్యటనలో విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా జట్టును ముందుండి నడిపించాడు' అని అన్నాడు. ఒక బ్యాట్స్మెన్గా, జట్టు కెప్టెన్గా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టమని శాస్త్రి చెప్పుకొచ్చాడు.
అయితే, కోహ్లీ శారీరకంగా, మానసికంగా ఆ కష్టాన్ని అధిగమించాడని రవిశాస్త్రి ఈ సందర్భంగా చెప్పాడు. కొంతమందికి కేవలం రెండు నెలల్లో 870పైగా పరుగులు చేయడం అసంభవమని, కానీ కోహ్లీ అది సాధించి చూపాడని రవిశాస్త్రి అన్నాడు.