పాంటింగ్ కన్నా ధోనీ బెటర్..
ఇలా అత్యంత విజవంతమైన కెప్టెన్లుగా నిలిచిన ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడాను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ తెలిపాడు. ఇప్పటికే ఆల్ టైం బెస్ట్ ఫినిషర్ అంటూ ధోనీని కొనియాడిన ఈ ఆసీస్ మాజీ క్రికెటర్.. మరోసారి అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఓ యూట్యూబ్ చానెల్ చిట్చాట్లో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కెప్టెన్సీ విషయంలో రికీ పాంటింగ్ కంటే ధోనీనే బెటర్ అని, గ్రౌండ్లో అతడు తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలవన్నాడు.
పాంటింగ్కు పర్ఫెక్షన్ కావాలి..
పాంటింగ్ సారథ్యంలో మైక్ హస్సీ ఏడేళ్లపాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. అలాగే ఐపీఎల్లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఏడేళ్లు ఆడాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరని అతన్ని ప్రశ్నించగా.. ‘నేను ప్రపంచంలోనే ఇద్దరు బెస్ట్ కెప్టెన్లను దగ్గరగా గమనించా. వీరిలో రికీ పాటింగ్ విషయానికి వస్తే అతడికి నాయకత్వం వహించడం అంటే ఇష్టం. గెలవడం అంటే చాలా ఇష్టం.ప్రతీ విషయంలోనూ పర్ఫెక్షన్ కోరుకుంటాడు. చివరికి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా జట్టును ముందుండి నడిపిస్తాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అతడే బాధ్యత తీసుకుంటాడు. ఆటగాళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తాడు.'అని చెప్పుకొచ్చాడు.
ధోనీ చాలా కూల్గా..
మ్యాచ్ను అంచనా వేసే విషయంలో ధోనీకి సాటిలేరని, ఈ విషయంలో పాంటింగ్ కన్నా ధోనీనే బెటర్ అన్నాడు. ‘ధోనీ చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి. ఓ లెక్కతో ఉంటాడు. గేమ్ను అద్భుతంగా అర్థం చేసుకుంటాడు. అయితే కొన్ని సార్లు ధోనీ తీసుకునే నిర్ణయాలను చూస్తే ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాదు. షాక్కు గురవుతాం. కానీ అవి కచ్చితంగా పనిచేస్తాయి. అవసరమైన ఫలితాలను రాబడతాయి. దీంతో నిజంగా అది ఎలా జరిగిందో కూడా మనకు అర్థం కాదు. ధోనీకి తనపై తనకున్న నమ్మకమే అలాంటి నిర్ణయాలను తీసుకునే ధైర్యాన్ని అతడికిస్తుంది. ఈ విషయంలో రికీ పాంటింగ్ కంటే ధోనీనే బెటర్ అని చెప్పడానికి నేనేమీ సంశయించను.' అని మైక్ హస్సీ చెప్పుకొచ్చాడు.
ధోనీ గొప్పతనం ఇదే..
‘నాకు తెలిసి ధోనీ బలం భారత్లాంటి దేశానికి ప్రాతినిథ్యం వహించడమే. ప్లేయర్లు ఒత్తిడి తనపై వేసుకోవడమే అతడికి ఉన్న గొప్ప సామర్థ్యం. ముఖ్యంగా యువ ఆటగాళ్లు స్వేచ్చగా ఆడేలా చూస్తాడు. ముఖ్యంగా క్రికెట్ను ఓ మతంలా భావించే భారత్లో ప్రతి ఒక్కరు విజయాన్నే కోరుకుంటారు. అయినా ధోనీ మాత్రం ఇది ఓ గేమ్ మాత్రమే.. మీ ఆటను మీరు ఆడండి. ఆస్వాదించండి. కొన్నిసార్లు గెలవచ్చు.. మరికొన్ని సార్లు ఓడిపోవచ్చు అని ఆటగాళ్లు చెబుతుంటాడు. భారీ అంచానాలు పెట్టుకునే దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ కూడా ఆటగాళ్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశాన్నివ్వడం ధోనీ గొప్పతనం'అని ఈ చెన్నై మాజీ ప్లేయర్ తెలిపాడు.
అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్సీ వహించిన రికార్డు ధోనీ, రికీపాంటింగ్ పేరిటనే ఉంది. ధోనీ 332 మ్యాచ్లకు సారథ్యం వహించగా.. ఇందులో భారత్ 178 గెలిచి 120 ఓడింది. పదేళ్ల పాటు ఆసీస్ జట్టును నడిపించిన పాంటింగ్ 324 మ్యాచ్లకు సారథ్యం వహించగా.. ఆసీస్ 220 గెలిచి 77 ఓడింది.