ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం:
ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 14వ సీజన్ అనంతరం ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఐపీఎల్ 2021 ఆరంభం ముందు కోహ్లీ తన నిర్ణయం ప్రకటించడం వల్ల బెంగళూరు ఆటగాళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే వార్తలు వినిపించాయి. మాజీలు, అభిమానులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అందరూ అనుకున్నట్లే సోమవారం రాత్రి కోల్కతాతో జరిగిన మ్యాచులో కోహ్లీసేన 92 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాచ్ అనంతర వర్చువల్ విలేకరుల సమావేశంలో ఆర్సీబీ హెడ్ కోచ్ మైక్ హెసన్ పాల్గొని జట్టు ఓటమిపై స్పందించాడు.
ఆ నిర్ణయం ప్రభావం చూపలేదు:
'విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని వీలైనంత త్వరగా బయటకు చెప్పాలని ముందే అనుకున్నాం. ఈ విషయం గురించి ప్రతి ఒక్క ఆటగాడికి ముందే తెలుసు. ముందుగా అందరితో కోహ్లీ తన నిర్ణయాన్ని చెప్పాడు. కోల్కతాతో ఆడిన మ్యాచ్లో కోహ్లీ నిర్ణయం ప్రభావం చూపలేదు. బ్యాటింగ్లో మేం సరిగ్గా ఆడకపోవడమే మా ఓటమికి అసలు కారణం. చాలా త్వరగా వికెట్లు కోల్పోయాం. సరైన భాగస్వామ్యాలు నిర్మించలేకపోయాం. భాగస్వామ్యాలు లేకపోతే ఇన్నింగ్స్ నిర్మించలేం. ఒక్కరు క్రీజులో ఉంటే.. మెరుగైన స్కోర్ చేసే వాళ్లం' అని ఆర్సీబీ హెడ్ కోచ్ మైక్ హెసన్ అన్నాడు.
బ్యాటింగ్ వైఫల్యమే కారణం:
'ఆర్సీబీ జట్టు అంతే వేగంగా ఓటముల నుంచి పుంజుకుంటుందనే నమ్మకం ఉంది. ఈరోజు జట్టు కూర్పులో ఎలాంటి సమస్య లేదు. నిజం చెప్పాలంటే.. మేం టాస్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. కేవలం 93 పరుగులు చేసే పిచ్ కాదు. కనీసం 150 పరుగులు చేయాల్సింది. ఆ స్కోర్ కూడా సరిపోదు అని నా అభిప్రాయం. మొత్తానికి బ్యాటింగ్ వైఫల్యమే ఓటమి కారణం' అని మైక్ హెసన్ చెప్పాడు. ఏబీ డివిలియర్స్ తమకు ముఖ్యమైన ఆటగాడు అని, అతడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నాడు. కేఎస్ భరత్ కీపింగ్ బాధ్యతలు చేపట్టేందుకు అర్హుడే అని పేర్కొన్నాడు.
ఈ ఓటమి మాకు మేలు కొలుపు లాంటిది:
ఈ ఓటమి తమకు మేలు కొలుపు లాంటిదని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. 'ఈ వికెట్పై మంచి భాగస్వామ్యాలు నెలకొల్పడం ఎంతో ముఖ్యం. ఆదిలోనే వికెట్పై తేమ అంత ప్రభావం చూపిస్తుందని మేం ఊహించలేదు. తొలుత బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నాం. 40 పరుగుల దాకా మేం ఒక్క వికెటే కోల్పోయాం. ఆ తర్వాత 20 పరుగుల్లోనే ఐదు వికెట్లు కోల్పోయాం. ఇక అక్కడి నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకున్నాం. ఈ ఓటమి మాకు మేలు కొలుపు లాంటిది. రెండో దశలో ఆదిలోనే ఇలా జరగడం వల్ల మున్ముందు ఏయే విషయాలపై దృష్టిసారించాలో తెలిసింది. అయితే ఎలాంటి పరిస్థితులకైనా అలవాటు పడాలి' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.