హైదరాబాద్: భారత్లో తొలి డేనైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలని భావిస్తోన్న బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో టీమిండియా-వెస్టిండిస్ జట్ల మధ్య డే-నైట్ టెస్టు నిర్వహించాలని అనుకున్న బీసీసీఐ అందుకు తగిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకుంది.
అయితే సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) బీసీసీఐ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అసలు ఎవరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కోశాధికారి అనిరుధ్ చౌదరి, క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సబా కరీంలను ఈ మెయిల్లో సంప్రదించిన బీసీసీఐ అక్టోబరులో డే-నైట్ టెస్టు నిర్వహించాలని నిర్ణయించింది.
Subscribe to Mykhel Telugu Newsletter
అమితాబ్ చౌదరి పంపిన ఈ మెయిల్లో సీఓఏ సభ్యులు లేకపోవడం విశేషం. దీంతో ఈ విషయంపై ఒంటెత్తు పోకడలకు పోతున్నారంటూ రాయ్.. ఘాటైన పదజాలంతో లేఖ రాశారు. 'మీ దృష్టిలో ముఖ్యమైన వారనుకున్న నలుగురితో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు. క్రికెట్కు సంబంధించిన అంశం కాబట్టి.. నాతో పోల్చుకుంటే మీకు జ్ఞానం ఎక్కువ. అయితే మీ కంటే సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీకి ఎక్కువ తెలుసు' అని అమితాబ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
డే-నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహణకు కోచ్ రవిశాస్త్రి కూడా మద్దతు తెలిపాడు. దీంతో 'రవిని సంప్రదించి ఉండొచ్చు. అయితే ఐదు రోజుల పాటు వేరే సమయంలో మైదానంలో ఆడాల్సిన ఆటగాళ్లను ముందు అడగాలి. ముఖ్యంగా ఐదు రోజులపాటు లైట్ల కింద ఆడేందుకు ఆటగాళ్ల శరీరం సహరిస్తుందా? లేదా?' అని వినోద్ రాయ్ చెప్పాడు.
మళ్లీ చెప్పే వరకు డే-నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహణపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని బోర్డును వినోద్ రాయ్ ఆదేశించాడు. కొత్త సమయాల విషయంలో ఐదు రోజులపాటు ఆడే ఆటగాళ్లతో చర్చించాల్సి ఉంది. నిర్వహణ వ్యయం, భద్రత గురించి కూడా ఆలోచించాలి అని లేఖలో పేర్కొన్నాడు.