హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మెచ్చిన క్రికెటర్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అని అంతా అనుకుంటారు. అయితే ఆయనకు సచిన్తో పాటు హైదరాబాద్కు చెందిన ఎంఎల్ జయసింహ అనే క్రికెటర్ అంటే ఎంతో ఇష్టమట.
సత్య నాదెళ్ల రాసిన హిట్ రిఫ్రెష్ అనే పుస్తక ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జయసింహ, సచిన్ టెండూల్కర్.. వీరిద్దరిలో నీ ఫేవరెట్ ఎవరనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ 'కష్టమైన ప్రశ్నే వేశారు, కానీ నేను హైదరాబాదీని కాబట్టి నా ఓటు జయసింహకే' అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్య నాదెళ్ల అనేక విషయాలను పంచుకున్నారు. ఓసారి వాళ్ల తన గదిలో కార్ల్ మాక్స్ పోస్టర్ వేలాడదీశాడని, దీంతో వాళ్లమ్మ వచ్చి లక్ష్మీ దేవి ఫొటోను గోడకు తగిలించిందని చెప్పాడు. దీనికి బదులుగా తను ఇష్టమైన ఆటగాడైన జయసింహ ఫొటోను ఉంచానని ఆయన చెప్పారు.
చూడ్డానికి చిన్నపిల్లాడిలా కనిపించే జయసింహ... ఈ హైదరాబాదీ క్రికెటర్ అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. అతడి స్టయిల్ తనకు ఎంతో నచ్చుతుందని తెలిపారు. సికింద్రాబాద్లో జన్మించిన జయసింహ 1959-1971ల మధ్య 39 టెస్టుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించి 2056 పరుగులు చేశారు.
జయసింహ చాలా స్టయిలిష్గా బ్యాటింగ్ చేశావారని, ఆ తర్వాతి తరంలో జట్టులో చోటు దక్కించుకున్న మాజీ క్రికెటర్లు అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్లు ఆయన మణికట్టు శైలిని అనుసరించేవారని సత్య నాదెళ్ల ఈ సందర్భంగా ప్రస్తావించారు.