
హైదరాబాద్: కొలంబో వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో శ్రీలంక జట్టుని శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని యువ భారత్ 3 వికెట్ల తేడాతో ఓడించింది. గెలుపు ఖాయం అనుకుని సంతోషంలో ఉన్న లంక ఆశలపై దీపక్ చహర్ (69 నాటౌట్; 82 బంతుల్లో 7×4, 1×6) నీళ్లుచల్లాడు. ఓడిపోతున్నామన్న దశలో భువనేశ్వర్ కుమార్ (19 నాటౌట్; 28 బంతుల్లో 2×4)తో కలిసి 8వ వికెట్కు 84 పరుగులు జోడించిన చహర్.. మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించాడు. 276 పరుగుల ఛేదనలో ఒకానొక దశలో 193/7తో నిలిచిన టీమిండియా.. చహర్ జోరుతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే 277/7తో గెలిచింది.
అయితే ఈ మ్యాచులో శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్, లంక కెప్టెన్ దాసున్ షనకల మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రస్తుతం వైరల్గా మారింది. మొదట టీమిండియా ఓటమి దిశగా సాగుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో సంతోషంగా కనిపించిన ఆర్థర్.. దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్ల ఇన్నింగ్స్ అతడిని సహనం కోల్పోయేలా చేశాయి. ఈ సందర్భంగా అతను డ్రెస్సింగ్ రూమ్లో కోపంతో విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు. పదేపదే డగౌట్లోకి వచ్చి అసహనం వ్యక్తం చేశాడు. ఇక మ్యాచ్ చివర్లో లంక ఓటమి దాదాపు ఖామమైంది. ఈ నేపథ్యలోనే ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చి కెప్టెన్ షనకతో ఏదో చర్చించాడు. ఆర్థర్ ఏవో సైగలు చేస్తేంటే షనక కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇరువరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.
శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్కు సంబందించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు మీమ్స్, కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. 'ఇదే దురుసు ప్రవర్తనతో పాక్ జట్టులో పదవి పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ మికీకి బుద్ది రాలేదు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'మికీ ఆర్థర్ కెరీర్ ముగినట్టే ఇగ' అని ఇంకొకరు కామెంట్ చేశారు.
'మ్యాచ్ కంటే మికీ రియాక్షన్స్ బాగున్నాయి', 'మికీ మంచి యాక్టర్.. కానీ క్రికెట్ ఆటలో మాత్రం కాదు', 'మ్యాచ్ జరుగుతుంటే కోచ్ మైదానంలోకి అడుగుపెట్టడం రూల్స్కు విరుద్ధం', 'టీమిండియా ఆటతీరును డిస్టర్బ్ చేయాలనే ఇలా ప్లాన్తోనే షనకతో గొడవపడ్డాడు' అంటూ కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. చరిత అసలంక (65), అవిష్క ఫెర్నాండో (50) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. చమిక కరుణరత్నె (44 నాటౌట్), భానుక రాజపక్స (36), ధనంజయ డిసిల్వా (32) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. బౌలింగ్లో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో అసమాన పోరాటం కనబర్చిన దీపక్ చహర్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే శుక్రవారం ఇక్కడే జరుగనుంది.