
హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టుపై విమర్శల వెల్లువ కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడిన ఘటనపై దక్షిణాఫ్రికా క్రికెట్ మాజీ కోచ్ మికీ ఆర్ధర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ సిగ్గుమాలిన క్రికెట్ ఆడుతుందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
ప్రపంచ క్రికెట్లో అన్ని జట్లదీ ఒక దారైతే, ఆసీస్ది మరొకదారి అంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. రోజు రోజుకూ క్రికెట్ సంస్కృతి ఎంతో పరిణితి సాధిస్తున్నప్పటికీ ఆసీస్ మాత్రం తన పంథాను మార్చుకోకుండా నియంతలా ప్రవర్తిస్తుందనడానికి తాజా ఘటనతో నిరూపితమైందన్నాడు.
గత కొన్నేళ్లుగా ఆసీస్ క్రికెట్ ప్రవర్తన అహంకారపూరితంగా సాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. క్రికెట్ ప్రపంచం ముందు దోషిగా నిలబడిన ఆసీస్ క్రికెట్కు ఇదొక గుణపాఠంగా ఆర్ధర్ అభివర్ణించాడు. 2013లో యాషెస్ సిరీస్ తర్వాత ఆర్ధర్ను కోచ్ పదవి నుంచి తొలగించిన క్రికెట్ ఆస్ట్రేలియా..ఆపై డారెన్ లీమన్కు ఆ బాధ్యతలు అప్పచెప్పింది.
దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్ధర్.. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్గా పని చేస్తున్నాడు. 2011-2013 జాతీయ జట్టుకు కోచ్గా పనిచేశాడు. అప్పట్లో ఆస్ట్రేలియా జట్టుకు కోచ్ గా పని చేసిన ఆర్థర్ను సైతం ఇటువంటి నియంత పాలనతోనే జట్టు కోచ్ పదవి నుంచి తొలగించారని ఆయన అభిప్రాయపడ్డాడు. మళ్లీ అదే తీరును ప్రదర్శించి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్ లపై నిషేదాన్ని జారీ చేసిందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును విమర్శించాడు.