హైదరాబాద్: ఇంగ్లాండ్ యువ బ్యాట్స్మన్ టామ్ బాంటన్ ఇప్పుడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడొద్దని ఇంగ్లీష్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ సూచించారు. ఐపీఎల్ ఆడటం కంటే ప్రస్తుతం కౌంటీ చాంపియన్ షిప్లో ఆడటమే ఉత్తమం అని వాన్ అభిప్రాయపడ్డారు. బాంటన్ భవిష్యత్తులో సూపర్ స్టార్ అవుతాడు. ఇప్పుడే ఐపీఎల్ ఆడాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అతడు కెరీర్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని వాన్ అంటున్నారు.
కెరీర్లో మాథ్యూస్ తొలి డబుల్ సెంచరీ.. విజయం దిశగా శ్రీలంక!!
గతేడాది డిసెంబర్ నెలలో ఐపీఎల్-13 కోసం జరిగిన వేలంలో టామ్ బాంటన్ను కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ. కోటి రూపాలకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాంటన్ బిగ్బాష్ లీగ్ (బీబీఎల్)లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున ఆడుతున్నాడు. సిడ్నీ థండర్తో జరిగిన మ్యాచ్లో వరుసగా అయిదు సిక్సర్లు బాది ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. దీంతో రూ. కోటికి కేకేఆర్ అతన్ని సొంతం చేసుకుంది.
తాజాగా మైకేల్ వాన్ మాట్లాడుతూ... 'బాంటన్ ఇప్పుడే ఐపీఎల్ ఆడాల్సిన అవసరం లేదు. కొన్ని వారాలు సోమెర్సెట్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడాలి. అవసరమైతే ఐపీఎల్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే.. ఇంగ్లాండ్ టెస్టు జట్టులో ఆరో స్థానం ఖాళీగా ఉంది. కౌంటీల్లో ఆడటం వల్ల ఆటగాడిగా బాంటన్ మరింత పరిణితి చెందుతాడు. టెస్టు ఆడినప్పుడు పరిపూర్ణమైన ఆట బయటకు వస్తుంది. కౌంటీలు అతడి కెరీర్కు ఎంతో లాభం చేకూరుస్థాయి' అని అన్నారు.
'ఐపీఎల్ బాంటన్ కోసం వేచి ఉంటుంది. భారత్కు వెళ్లడానికి అతడికి ఇంకా చాలా సమయం ఉంది అని నా అభిప్రాయం. ప్రస్తుతం అతడు నాలుగు రోజుల క్రికెట్ ఆడి సెంచరీలు చేయాలి. బాంటన్ టెస్టు జట్టులో చేరితే.. ఇంగ్లాండ్ లైనప్ మరింత పటిష్ఠంగా మారుతుంది. బాంటన్ కౌంటీల్లో సత్తా నిరూపించుకుని టెస్టు జట్టులోకి వచ్చే సువర్ణావకాశం ముందుంది. ఇక కెరీర్ గురించి ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి' అని మైకేల్ వాన్ పేర్కొన్నారు.
వికెట్ కీపర్, బ్యాట్స్మన్ అయిన బాంటన్ ఇంగ్లాండ్ తరఫున ఇప్పటికే మూడు టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. మూడు టీ20లలో 56 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 31. 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 570, 18 లిస్ట్ ఏ మ్యాచ్లలో 524, 27 టీ20లలో 870 పరుగులు చేసాడు. మొత్తంగా 10 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు.