
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. ఎప్పుడూ భారత జట్టుపై తన అక్కసును వెళ్లగక్కుతుంటాడు. టీమిండియా ఓటమి కోసమే ఎదురుచూస్తుంటాడు. జట్టు ఓడినప్పుడల్లా సూటి పోటీ కామెంట్లతో భారత ఆటగాళ్లను, అభిమానులను మరింత బాధపెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. జట్టు ఆటతీరును కూడా సెటైరికల్గా కొనియాడుతుంటాడు. అయితే భారత్కు వ్యతిరేకంగా కామెంట్ చేసిన ప్రతీసారి మైకేల్ వాన్కు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చురకలంటిస్తున్నాడు. దిమ్మతిరిగే రిప్లేలతో అతను నోరు మూయిస్తుంటాడు. వీరి మధ్య జరిగే ట్విటర్ వార్ను అభిమానులు ఆసక్తిగా గమనిస్తుంటారు.
తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్తో ఉన్న కయ్యం గురించి మైకేల్ వాన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా మరోసారి జాఫర్ను తన మాటలతో కవ్వించాడు. జాఫర్తో కయ్యం ఎప్పుడు మొదలైందో తెలుసుకోవాలంటే 2002 లార్డ్స్ టెస్ట్ మ్యాచ్నాటి సంగతులను గుర్తు చేసుకోవాలన్నాడు.
'టెస్ట్ల్లో నా తొలి వికెట్ వసీం జాఫర్దే. 2002లో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో నేను విసిరిన బంతి జాఫర్ బ్యాట్కు ఎడ్జ్ తీసుకొని స్లిప్లో ఉన్న ఫీల్డర్ చేతిలో పడింది. నా బౌలింగ్లోనే జాఫర్ ఆడలేకపోయాడు.'అని పేర్కొన్నాడు.
తమ మధ్య ట్విటర్ వార్ సరదాగా ఉంటుందని, దానిని ఎంతో ఎంజాయ్ చేస్తానని వాన్ చెప్పుకొచ్చాడు. జాఫర్ స్పందన కోసం వేచి చూస్తానని తెలిపాడు. మైకేల్ వాన్ తన 82 టెస్ట్ల కెరీర్లో కేవలం 6 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. అందులోనూ నాలుగు భారత్కు చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. 2002లో టీమిండియా నాలుగు టెస్ట్లను ఆడేందుకు ఇంగ్లండ్లో పర్యటించింది. ఈ సందర్భంగా తొలి టెస్ట్లో వసీం జాఫర్ను రెండో టెస్ట్లో సచిన్, అజిత్ అగార్కర్, నాలుగో టెస్ట్ మ్యాచ్లో మరోసారి అగార్కర్ వికెట్ను తీశాడు. సచిన్ అగార్కర్లను బౌల్డ్ చేయగా.. జాఫర్ క్యాచ్ రూపంలో వికెట్ను దక్కించుకున్నాడు.