ఆంటిగ్వా: ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నిర్వహించుకొనేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సర్వహక్కులూ ఉన్నాయని వెస్టిండీస్ మాజీ పేసర్ మైకేల్ హోల్డింగ్ అన్నారు. ప్రయాణాలు, ప్రేక్షకులపై ఆంక్షలు విధించడమన్నది ఆస్ట్రేలియా ప్రభుత్వ ఇష్టమన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో షెడ్యూల్ అయి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో మెగాటోర్నీపై అనిశ్చితి నెలకొంది. టోర్నీ వాయిదాపై ఈ వారంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఇంటికి వెళ్లిపో.. ఇక నీ కెరీర్ ముగిసిపోయింది.. గంగూలీకి సచిన్ సీరియస్ వార్నింగ్!!
తాజాగా వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మైకేల్ హోల్డింగ్ మాట్లడుతూ... 'ఐపీఎల్ 2020 నిర్వహణ కోసం టీ20 ప్రపంచకప్ను ఆలస్యం చేస్తారని నాకు అనిపించడం లేదు. ప్రస్తుతానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ముందు మరో ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదు. నిర్దేశిత సమయం వరకు పర్యాటకులను అనుమతించాలా వద్దా అనేది ఆస్ట్రేలియా చట్టాలకు లోబడి ఉంటుంది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ లేకపోతే అదే సమయంలో ఐపీఎల్ నిర్వహించుకొనేందుకు బీసీసీఐకి సర్వహక్కులూ ఉన్నాయి. ఒకవేళ వారు ఉద్దేశపూర్వకంగా చేస్తే మీరు నిరాకరించొచ్చు. ఆ సమయంలో మిగతా టోర్నీలు కూడా ఏమీ లేవు కాబట్టి ఇక అభ్యంతరాలేంటి?' అని హోల్డింగ్ ప్రశ్నించాడు.
కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో బంతిపై ఉమ్మినిరుద్దడాన్ని ఐసీసీ కమిటీ నిషేధించిన సంగతి తెలిసిందే. దీన్ని అమలు చేసేందుకు ఇబ్బందులేమీ రావని హోల్డింగ్ అభిప్రాయపడుతున్నాడు. ఆటగాళ్లు అలవాటు పడాల్సి ఉంటుందన్నాడు. 'ఉమ్మిని నిషేధించడం పెద్ద సమస్యేమీ కాదు. ఆటగాళ్లు ఇందుకు అలవాటు పడేందుకు సమయం తీసుకోవడమే సమస్య. మైదానంలో ఉన్నప్పుడు బంతిపై మెరుపు తీసుకురావడమన్నది సహజం. అందుకే ఉమ్మిని ఉపయోగిస్తారు. స్వింగ్ చేసేందుకు బంతికి కాస్త తేమ అవసరం. అందుకు ఉమ్మి బదులు చెమట ఉపయోగించుకోవచ్చు' అని హోల్డింగ్ పేర్కొన్నారు.
షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభంకావాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఈ టోర్నీనిబీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసేసింది. అయితే అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వాయిదా వేయాలని చూస్తుండటంతో.. ఆ విండోలో ఐపీఎల్ని నిర్వహించేందుకు బీసీసీఐ సమాయత్తమవుతోంది. కానీ ఐపీఎల్ కోసమే టీ20 ప్రపంచకప్ని ఐసీసీ వాయిదా వేయబోతోందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హోల్డింగ్ స్పందించాడు.
టీ20 వప్రపంచకప్కి తాము ఆతిథ్యమివ్వలేమని నెల కిందటే క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. వైరస్ కారణంగా ఆ దేశ ప్రభుత్వం సెప్టెంబరు వరకూ పర్యాటక వీసాలపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ కోసం 16 క్రికెట్ జట్లు అక్కడికి చేరుకోవడం.. టోర్నీకి ముందు 14 రోజులు క్వారంటైన్లో ఉండటం అసాద్యం. దాంతో సీఏతో చర్చలు జరిపిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ని 2022కి వాయిదావేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటని విడుదల చేయాలని ఐసీసీ భావిస్తోంది. అయితే చివరి నిమిషంలో ఆస్ట్రేలియా 2021 టీ20 వరల్డ్కప్ ఆతిథ్య హక్కుల్ని భారత్ నుంచి తమకి బదిలీ చేయాలని మెలిక పెట్టింది. దీంతో ఐసీసీ మళ్లీ ఆలోచనలో పడింది. దీనిపై వచ్చే వారాం పూర్తి క్లారిటీ రానుంది.