'ఇంత తక్కువ ధరతో స్టీవ్ స్మిత్ ఐపీఎల్ ఆడడు.. ఎదో సాకు చెప్పి తప్పించుకుంటాడు'

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలంలో అతి తక్కువ ధర పలికిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ మెగా ఈవెంట్లో ఆడబోడని ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ఆడడానికి విమానంలో బయలుదేరడానికి ముందు స్మిత్ ఎదో సాకు చెప్పి తప్పించుకుంటాడన్నాడు. స్మిత్కు తొడ కండరాల గాయం అవుతుందని ఆసీస్ మాజీ సారథి పరోక్షంగా విమర్శించాడు. ఐపీఎల్ వేలంలో స్మిత్ను రూ. 2.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్మిత్ కొనుగోలుపై క్లార్క్ స్పందించాడు.

స్మిత్కు దక్కిన ధరకు ఆశ్చర్యపోయా:
తాజాగా క్రీడా పాడ్కాస్ట్లో మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ... 'ఈసారి వేలంలో స్టీవ్ స్మిత్కు దక్కిన ధరకు ఆశ్చర్యపోయా. ఇంత తక్కువ ధర పలికిన స్మిత్ ఐపీఎల్ 14వ సీజన్లో ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇండియా ఫ్లైట్ ఎక్కే తరుణంలో ఏదో ఒక కారణం చెప్పి స్మిత్ దూరంగా ఉంటాడు. స్మిత్కు తొడ కండరాల గాయం కావొచ్చు. గత సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన స్మిత్ వేలంలో ఇప్పుడొచ్చిన ధరతో అవమానంగా ఫీలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తరంలో ఉత్తమ బ్యాట్స్మన్లలో అతని పేరు కచ్చితంగా ఉంటుంది' అని అన్నాడు.

ఈ అర్హత చాలదా?:
'ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో బ్యాట్స్మన్ల జాబితాలో విరాట్ కోహ్లీ టాప్లో ఉంటే.. స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇద్దరి మధ్య ఒక్క ర్యాంక్ మాత్రమే తేడా ఉంది. స్మిత్ బెస్ట్ బ్యాట్స్మన్ అని చెప్పడానికి ఈ ఒక్క అర్హత చాలదా?. తక్కువ ధరకు అమ్ముడుపోయిన స్మిత్ 11 వారాల పాటు తన కుటుంబానికి దూరంగా ఉంటాడని మాత్రం అనుకోవట్లేదు. ఒకవేళ అతను ఐపీఎల్ ఆడాలని భావించినా.. మధ్యలోనే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి' అని మైఖేల్ క్లార్క్ చెప్పాడు.

డబ్బు కోసమే కాకుండా:
అయితే తన వ్యాఖ్యలు తప్పని కూడా స్టీవ్ స్మిత్ నిరూపించొచ్చని మైఖేల్ క్లార్క్ చెప్పాడు. డబ్బు కోసమే కాకుండా తన ఆటను మెరుగుపర్చుకునేందుకైనా అతడు ఆడతాడని మరో విధంగా వ్యాఖ్యానించాడు. ఈసారి రాణించి వచ్చే వేలంలో తన ధర పెంచుకోడానికైనా ఆడొచ్చని క్లార్క్ అన్నాడు. యూఏఈలో జరిగిన గత సీజన్లో స్మిత్ సారధ్యంలోని రాజస్తాన్ రాయల్స్ టోర్నీలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. 14 మ్యాచ్లాడి 6 విజయాలు, 8 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అటు స్మిత్ బ్యాట్స్మన్గా 14 మ్యాచ్ల్లో 311 పరుగుల సాధించి విఫలమయ్యాడు.

ఏ జట్టూ ఆసక్తి చూపకపోవడంతో:
13వ సీజన్లో స్మిత్ పెద్దగా రాణించకపోవడంతో అతడిని వదిలేస్తున్నట్లు రాజస్థాన్ జనవరిలో స్పష్టం చేసింది. తాజాగా చెన్నైలో జరిగిన వేలంలో ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అతడిని తీసుకునేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపకపోవడంతో రూ.2.2 కోట్ల తక్కువ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. స్మిత్ 2012 నుంచీ ఐపీఎల్లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు మొత్తం 95 మ్యాచ్లు ఆడి 2333 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం, 11 అర్ధశతకాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications