
హైదరాబాద్: '#మీటూ' ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం సినిమా రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా మీడియా వంటి ఇతర రంగాలకు చెందిన మహిళలు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను.. అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను ధైర్యంగా వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే.
తాజాగా 'మీటూ' ఉద్యమం సెగ క్రీడారంగానికి కూడా తగిలింది. రెండు రోజుల క్రితం ఓ ఎయిర్హోస్టెస్ శ్రీలంక మాజీ క్రికెటర్, కెప్టెన్ అర్జున రణతుంగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించగా... గురువారం శ్రీలంకకు చెందిన మరో క్రికెటర్ లసిత్ మలింగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాదకు తెలపడం, ఆమె ఆ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేయడం మనం చూశాం.
అయితే తాజాగా భారత క్రికెట్ నియంత్ర మండలి (బీసీసీఐ) సీఈఓ రాహుల్ జోహ్రి చీకటి కోణాన్ని ఓ మహిళా జర్నలిస్టు బయటపెట్టింది. తనను రాహుల్ జోహ్రి లైంగికంగా వేధించాడని, మంచిగా నటిస్తూ తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆమె ట్విట్టర్లో అతడి భాగోతాన్ని ట్వీట్లో వివరించింది.
రాహుల్ తన మాజీ సహుద్యోగని, ఓ రోజు తమ జాబ్కు సంబంధించిన విషయాలకు గురించి చర్చించడానికి వెళ్తే.. దానిని అతను అవకాశంగా తీసుకున్నాడని ఆరోపించింది. తనతో మంచిగా నటిస్తూ ఓ రోజు అతని భార్య, పిల్లలు లేని సమయంలో తనింటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని పేర్కొంది. అతని చర్యతో తనలో తను ఎంతో కుమిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, రాహుల్ జోహ్రి బీసీసీఐ సీఈఓ కాకముందు ఓ డిస్కవరీ చానల్లో పనిచేశారు. ఈ లైంగిక ఆరోఫణలను తాను అప్పట్లో ఎదుర్కొనానని సదరు బాధితురాలు వెల్లడించింది.