థర్డ్ అంపైర్ కూడా ఔట్గానే
అయితే, థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. కానీ.. అశ్విన్ అనైతికతంగా వ్యవహరించాడని కాసేపు మైదానంలో గొడవచేసిన బట్లర్.. తిట్టుకుంటూనే పెవిలియన్కి వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదం కూడా చోటు చేసుకుంది. అంతేకాదు జోస్ బట్లర్ ఔట్ రాజస్తాన్ విజయవకాశాలు దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో అశ్విన్ ఇలా చేయాల్సింది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో మన్కడింగ్ నిబంధనపై తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎంసీసీ ఆ నిబంధనపై వివరణ ఇచ్చింది. ఈ విషయంలో అశ్విన్ది ఏమాత్రం తప్పులేదని, అతడు నిబంధనల మేరకే నడుచుకున్నాడని స్పష్టం చేసింది.
మన్కడింగ్ నిబంధన ఉండాలి
మన్కడింగ్ నిబంధన ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని మంగళవారం ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) ఓ ప్రకటనలో పేర్కొంది. "ఈ నిబంధన ఎంతో ముఖ్యం. ఇది లేకుంటే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో బ్యాట్స్మన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాడు. బౌలర్ బంతి వేయకుండానే సగం పిచ్ దాటేస్తారు. ఇలా జరగకుండాలంటే ఈ నిబంధన ఉండాల్సిందే. ఇక బౌలర్ బ్యాట్స్మన్ను హెచ్చరించాలనే విషయం నిబంధనలో లేదు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్దం కూడా కాదు. బౌలర్ బంతి వేయకుండానే నాన్స్ట్రైకర్ క్రీజు దాటితేనే రనౌట్ అవుతారు" అని స్పష్టం చేసింది.
అశ్విన్ కావాలనే అలా చేసి ఉంటే
"ఒక వేళ అశ్విన్ కావాలనే అలా చేసి ఉంటే మాత్రం అది క్రీడా స్పూర్తికి విరుద్దం. కానీ అశ్విన్ అలా చేయలేదని చెప్పాడు. టీవీ అంపైర్ కూడా నిబంధనల ప్రకారమే ఔట్ ఇచ్చాడు. "నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉండే బ్యాట్స్మన్ మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. నిబంధనలకు విరుద్దంగా ప్రయత్నించకూడదు. బౌలర్లు కూడా నిబంధనలకు లోబడే బౌలింగ్ చేయాలి" అని 41.16 నిబంధనపై ఎంసీసీ స్పష్టతనిచ్చింది. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ బ్యాట్స్మెన్ని ఔట్ చేయడం ఇదే తొలిసారి.
మన్కడింగ్ ఔట్ని సమర్ధించుకున్న అశ్విన్
మరోవైపు మన్కడింగ్ ఔట్ని అశ్విన్ సమర్ధించుకున్నాడు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ "మన్కడింగ్ ఘటనపై అసలు చర్చే అనవసరం. కావాలని చేసింది కాదు. అలా జరిగిపోయింది. నా బౌలింగ్ యాక్షన్ పూర్తి కాకముందే బట్లర్ క్రీజు వదిలాడు. "అంతకుముందు కూడా ఇది గమనించాను. ఈ విషయంలో నేను స్పష్టంగా ఉన్నా. నేను బౌలింగ్ చేసేందుకు వస్తుంటే అతడు కనీసం నన్ను చూడలేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్ను మలుపు తిప్పుతాయి కాబట్టి బ్యాట్స్మన్ జాగరూకతతో ఉండటం అవసరం" అని అన్నాడు.