ఆసీస్తో టీ20 సిరిస్కి మార్కండే
వరల్డ్ కప్కు ముందు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు అతడి స్థానంలో మయాంక్ మార్కండేను ఎంపిక చేశారు. భారత జట్టుకు ఎంపికవడం అతడికిదే తొలిసారి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి ప్రాతినిథ్యం వహిస్తోన్న మయాంక్ మార్కండే దేశవాళీ క్రికెట్లో, భారత్-ఎ జట్టు తరఫున ఇటీవలే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు.
జాతీయ జట్టుకు ఆడాలన్న తన కల నెరవేరింది
ఈ నేపథ్యంలో జాతీయ జట్టుకు ఆడాలన్న తన కల నెరవేరిందని మయాంక్ అన్నాడు. శనివారం మీడియాతో మాట్లాడుతూ "ఇటీవల రంజీ ట్రోఫీ, భారత్-ఎ టీమ్ తరఫున నా ప్రదర్శనని సెలక్టర్లు గుర్తించారు. టీమిండియాలో అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే దీన్ని నేను ఊహించలేదు" అని అన్నాడు.
లెగ్ స్పిన్కి మెరుగులు దిద్దుకుంటున్నా
"ఇంత త్వరగా జాతీయ జట్టులో భాగం అవుతానని అనుకోలేదు. గత ఏడాదికాలంగా నా లెగ్ స్పిన్కి మెరుగులు దిద్దుకుంటున్నా. ఇండియా‘ఏ', రంజీ ట్రోఫీల్లో నా ప్రదర్శన వల్లే సెలక్టర్లు నన్ను ఎంపిక చేశారనుకుంటాను. నన్ను నిరూపించుకోవడానికి నాకో అవకాశం ఇచ్చిన సెలక్టర్లకు ధన్యవాదాలు" అని మయాంక్ మార్కండే తెలిపాడు.
నా తండ్రి కల నెరవేరుస్తా
"గాయం కారణంగా నా తండ్రి భారత్ జట్టుకి కనీసం ఒక్కసారి కూడా ఆడలేకపోయాడు. ఇప్పుడు నేను ఆడటం ద్వారా నా తండ్రి కల నెరవేరుస్తా. ఆసీస్పై తుది జట్టులో చోటు గురించి నేను ఆలోచించడం లేదు" అని మార్కండే వెల్లడించాడు. ఫిబ్రవరి 24న విశాఖపట్నంలో జరిగే తొలి టీ20తో భారత్లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.