హైదరాబాద్: లీడ్స్ వేదికగా టీమిండియాతో జరగనున్న ఆఖరి వన్డేలో భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను అలవోకగా ఎదుర్కొంటామని ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ ధీమా వ్యక్తం చేశాడు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం మూడో వన్డే జరగనుంది.
ఈ సిరిస్లో ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో 1-1తో సమమైంది. దీంతో మూడో వన్డే సిరిస్ విజేతను నిర్ణయించేది కావడంతో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మూడో వన్డేకి ముందు మార్క్ వుడ్ మాట్లాడుతూ కుల్దీప్ బౌలింగ్లో వికెట్ ఇవ్వకుండా ఆడితే ఆ తర్వాత పరుగులు సులభంగానే చేయొచ్చని తెలిపాడు.
"రెండో వన్డేలో కుల్దీప్ బౌలింగ్లో మా బ్యాట్స్మెన్ బాగా ఆడటం మాకు కలిసొచ్చే అంశం. అతడు మూడు వికెట్లు తీసిన సంగతి నాకు తెలుసు. అయితే మా కుర్రాళ్లు చక్కగా ఆడి అతడిపై ఒత్తిడి తెచ్చారు. అతడు తన తొలి ఓవర్లోనే వికెట్లు తీయడమే చాలా ముఖ్యం. అదే ఆటలో కీలకం అవుతోంది" అని మార్క్ వుడ్ అన్నాడు.
"మేము తొలి ఓవర్లోనే వికెట్ ఇస్తే అతడి ఆత్మవిశ్వాసం పెరిగి ఇంకా బాగా బౌలింగ్ చేస్తాడు. అందుకే మేం తొలుత వికెట్లు ఇవ్వకుంటే అతడిపై ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతాడు. దూకుడుగా ఆడితేనే అతడి బౌలింగ్లో పరుగులు చేయగలం. అలా కుల్దీప్ బౌలింగ్ను ఎదుర్కొంటాం" అని పేర్కొన్నాడు.
ఇప్పటివరకు ముగిసిన రెండో వన్డేల్లో కలిపి కుల్దీప్ యాదవ్ 9 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్లు తీసి ఇంగ్లీష్ గడ్డపై కుల్దీప్ యాదవ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అతడి బౌలింగ్ను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.