
హైదరాబాద్: బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ అరుదైన ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపు ఏలో భాగంగా హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో సోమవారం మనోజ్ తివారీ ఈ అరుదైన ఘనత సాధించాడు. రంజీ క్రికెట్లో మనోజ్ తివారీకి ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ కావడం విశేషం.
ఈ ట్రిపుల్ సెంచరీ మనోజ్ తివారీకి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే బెంగాల్ ఇన్నింగ్స్లో మరే ఇతర బ్యాట్స్మెన్ సెంచరీ సాధించలేదు. హైదరాబాద్ బౌలర్లను చాలా ఈజీగా ఎదుర్కొన్న మనోజ్ తివారీ 414 బంతుల్లో 30 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో అజేయంగా 303 పరుగులు చేశాడు.
బెంగాల్ ఇన్నింగ్స్ 105వ ఓవర్లో హైదరాబాద్ ఫీల్డర్ రవి కిరణ్ ఇచ్చిన లైఫ్ని సద్వినియోగం చేసుకున్న మనోజ్ తివారీ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మనోజ్ తివారీ ట్రిపుల్ సెంచరీతో బెంగాల్ జట్టు 635/7 పరుగులు వద్ద తన ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
మ్యాచ్ అనంతరం మనోజ్ తివారీ మాట్లాడుతూ "నా అత్యుత్తమ ఇన్నింగ్స్లో ఇదొకటి. దీనికి ముందు ఐదు సార్లు డబుల్ సెంచరీలు చేసినందున టాప్-7లో ఈ ఇన్నింగ్స్ తప్పక ఉంటుంది. అయితే ఈ ట్రిపుల్ సెంచరీ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది కీలకమైన దశలో సాధించాను కాబట్టి" అని అన్నాడు.
"నేను బాగా ఆడుతున్నాను, కాని పెద్ద ఇన్నింగ్స్ ఒకటి బాకీ ఉన్నాను. కేరళతో తలపడినప్పుడు నాపై నాకు దుస్సంకోచం వచ్చింది. కానీ, నేను బ్యాటింగ్లో బాగా రాణిస్తున్నానని నాకు తెలుసు. ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే ఇది నా ఉత్తమ ఇన్నింగ్స్లో ఒకటి" అని మనోజ్ తివారీ చెప్పుకొచ్చాడు.
మనోజ్ తివారీ ఇంతకుముందు బెంగాల్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహారించాడు. అయితే, గతేడాది ఆగస్టులో మూడు ఫార్మాట్లలో అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ను కెప్టెన్గా ఎంపిక చేశాడు. కాగా, మనోజ్ తివారీ చివరిసారిగా 2015లో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో భారత్ తరఫున ఆడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపూఎల్)లో 2018లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున చివరిగా ఆడిన మనోజ్ తివారీ ఆ తర్వాత ఐపీఎల్ 2019, 2020 సీజన్ల కోసం నిర్వహించిన వేలంలో అమ్ముడుపోలేదు.